బీజేపీ సైలెంట్ ఆపరేషన్, పవన్ కొత్త లెక్కల వెనుక..!!
తెలంగాణలో కొత్త రాజకీయం మొదలైంది. బెంగాల్ లో గెలుపు తరువాత బీజేపీ దక్షిణాది రాష్ట్రాల పైన ఫోకస్ చేసింది. తెలంగాణలో సైలెంట్ ఆపరేషన్ చేస్తోంది. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నిక లే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు అమలవుతున్నాయి. ముఖ్య నేతలు తెలంగాణలో మకాం వేయటం వెనుక కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో జనసేనాని పవన్ తెలంగాణలో వేస్తున్న కొత్త అడుగులు సైతం రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.
బీజేపీ అధినాయకత్వం పై దక్షిణాది పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం చేసింది. ఏపీ తరహాలో తెలంగాణలోనూ ఎన్డీఏ విస్తరణ ఉంటుందని తొలుత భావించినా... ఆ తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఎన్నికల లోగా క్షేత్ర స్థాయిలో పూర్తిగా పార్టీ బలోపేతం దిశగా కసరత్తు మొదలు పెట్టింది.

పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మూడు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. నితిన్ నబీన్ పర్యటనలో టీబీజేపీ స్టేట్ ఎక్సిక్యూటివ్ మీటింగ్ ఏర్పాటు చేసారు. అదే విధంగా అధ్యక్షుడుతో వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డిలో జిల్లాలో మీటింగ్లకు ప్లాన్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ జరిగే మీటింగ్లకు ప్రాధాన్యత ఏర్పడింది.
కాగా, కేంద్ర మంత్రులు సైతం వరుసగా తెలంగాణలో పర్యటించాలని పార్టీ నాయకత్వం ఇప్పటి కే నిర్దేశించింది. ప్రతీ పోలింగ్ బూత్ పరిధిలో కమిటీలు ఏర్పాటు చేసి ఓటర్లకు దగ్గరయ్యే విధంగా ప్రణాళికలు సిద్దం చేయాలని పార్టీ ఇప్పటికే నిర్దేశించింది. కొంత మంది బీజేపీ నేతల మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ పైనా నాయకత్వం సీరియస్ గా ఉంది. కీలక నిర్ణయాలు ఉంటాయని తేల్చి చెబుతోంది.
ఇదే సమయంలో పవన్ సైతం తెలంగాణలో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి ఇప్పటికే నిర్ణయించారు. అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల నాటికి ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయ కర్తలను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ మూలాలు ఉన్న ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజక వర్గాల పైన పవన్ ఫోకస్ చేసినట్లు సమాచారం. దీంతో.. అటు బీజేపీ, ఇటు పవన్ తెలంగాణ కేంద్రంగా తీసుకుంటున్న కొత్త నిర్ణయాల పైన రాజకీయంగా ఆసక్తి నెలకొంది.














Click it and Unblock the Notifications