తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ రిలీజ్: అక్కడ స్టార్ వార్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రచార జోరు పెరుగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి. ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది.
తెలంగాణలో ఈ నెల 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్లో తొలి విడత, మిజోరంలల్లో పోలింగ్ ముగిసింది.

తెలంగాణలో నామినేషన్లను దాఖలు చేయడానికి నేడే చివరి గడువు. ఈ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయాల్సి ఉంటుంది. 13వ తేదీన వాటి స్క్రూటినీ ఉంటుంది. నామినేషన్ పేపర్లను ఉపసంహరించుకోవడానికి చివరి తేదీ 15.
ఇప్పటికే భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్.. నామినేషన్ను దాఖలు చేశారు. పలువురు సీనియర్ నేతలూ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నేడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కామారెడ్డి నియోజకవర్గంలో నామినేషన్ వేయనున్నారు.
ఈ పరిస్థితుల్లో తెలంగాణ బీజేపీ తన తుది జాబితాను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. మొత్తం 14 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితా ఇది. నాలుగు ఎస్సీ రిజర్వుడ్ స్థానాలతో పాటు మొత్తం 14 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై పూర్తిస్థాయి కసరత్తు చేసిన అనంతరం దీన్ని విడుదల చేసింది.
బెల్లంపల్లి (ఎస్సీ రిజర్వుడ్)- కొయ్యల ఎమాజీ, పెద్దపల్లి- దుగ్యాల ప్రదీప్, సంగారెడ్డి దేశ్పాండే రాజేశ్వర్ రావు, మేడ్చల్- ఏనుగు సుదర్శన్ రెడ్డి, మల్కాజ్గిరి- ఎన్ రామచందర్ రావు, శేరిలింగంపల్లి- రవికుమార్ యాదవ్, నాంపల్లి-రవిచంద్ర, చంద్రాయన్ గుట్ట- కే మహేందర్ను తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ రిజర్వుడ్)- గణేష్ నారాయణ్, దేవరకద్ర- కొండా ప్రశాంత్ రెడ్డి, వనపర్తి- అనుజ్ఞ రెడ్డి, అలంపూర్ (ఎస్సీ రిజర్వుడ్)- మేరమ్మ, నర్సంపేట్- కే పుల్లారావు, మధిర (ఎస్సీ రిజర్వుడ్)- పెరుమార్పల్లి విజయ్ రాజు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
మల్కాజ్గిరిలో ఎన్ రామచందర్ రావు పేరును ఖరారు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నియోజకవర్గం స్టార్ వార్గా నిలిచినట్టయింది. త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ తరఫున మైనంపల్లి హనుమంతరావు పోటీలో ఉన్నారు. వారికి రామచందర్ రావు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications