TRS ఆర్థిక మూలాలపై గురిపెట్టిన BJP?
తెలంగాణ రాష్ట్రంలో ఎలాగైనా సరే ఈసారి పాగా వేయాలనే కృతనిశ్చయంతో ఉన్న భారతీయ జనతాపార్టీ ఢిల్లీ పెద్దలు అందుకు తగ్గ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ టీఆర్ఎస్తో తలపడేది బీజేపీనే అనే భావనను ప్రజల్లో తీసుకురాగలిగారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనే ఉండాలనేది ఆ పార్టీనేతల వ్యూహం.
టీఆర్ఎస్ ను బలహీనపరిచేలా మరో వ్యూహం?
తెలంగాణ రాష్ట్ర సమితిని బలహీనపరచడానికి తాజాగా మరో వ్యూహానికి ఢిల్లీ పెద్దలు తెరతీశారు. ఆ పార్టీకి ఆర్థిక మూలాలు ఏమిటి? ఎవరందిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? తదితర వివరాలన్నింటినీ తెప్పించుకున్నట్లు సమాచారం. ఆ ప్రకారం ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ను ఆర్థిక దిగ్బంధనం చేయబోతున్నారు. 2019 ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎలాఅయితే దిగ్బంధనం చేశారో ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్ను అలా కట్టడి చేయాలనేది ఆ పార్టీ ప్రణాళికగా ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రానికి అప్పు పుట్టకుండా చేస్తున్న బీజేపీ?
ఇటీవల ఒక సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మన పార్టీ దగ్గర వెయ్యి కోట్ల రూపాయలున్నాయంటూ వ్యాఖ్యానించారు. పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి చేసిన ప్రకటనగా అందరూ తీసుకున్నారు. కానీ బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకొని వివరాలు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత ప్రబలేలా రాష్ట్రానికి అవసరమైన నిధులు మంజూరు చేయడంలో కేంద్రం తాత్సారం చేస్తోంది. అంతేకాకుండా ఆ రాష్ట్రానికి ఎక్కడా అప్పు పుట్టకుండా వ్యవహరిస్తోందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీమంత్రి కేటీఆర్ ధ్వజమెత్తుతున్నారు. దీనివల్లే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో, పింఛన్లు ఇవ్వడంలో ఆలస్యమవుతోంది.
ఆర్థికంగా అలజడి సృష్టించడం..
ప్రభుత్వం ఇప్పటికే కొత్తగా పింఛన్ల మంజూరు నిలిపేసింది. రేషన్ కార్డులు కూడా మంజూరు చేయడంలేదు. ఇవి రెండూ ఇవ్వగలిగితే ఈసారి కూడా తెలంగాణ రాష్ట్ర సమితిదే విజయమని ప్రశాంత్ కిషోర్ సర్వే కూడా తేల్చింది. కానీ ఇవి ఇవ్వాలంటే రాష్ట్రానికి రూపాయి కావాలి. ఆ రూపాయి ఇవ్వకుండా బ్యాంకులను, ఆర్థిక సంస్థలను అడ్డుకుంటోందంటూ కేంద్రంపై కేసీఆర్ మండిపడుతున్నారు.
ఒకరకంగా ఆయన బీఆర్ ఎస్ స్థాపనకు ఇవే కారణమని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు. రాష్ట్రంలో ఆర్థికంగా అలజడి సృష్టించి, ప్రభుత్వ ఖజానా దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా చేసి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రబలేలా చేసి ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఆ వ్యతిరేకతను ఉపయోగించుకోవడమే భారతీయ జనతాపార్టీ ఢిల్లీ పెద్దల వ్యూహంగా ఉంది. అయితే వ్యూహాలకు ప్రతివ్యూహాలను రూపొందించడంలో దిట్ట అయిన కేసీఆర్ ఎలాగైనా ఈ పరిస్థితులను అధిగమిస్తారని, తమకు త్వరలోనే రేషన్కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తారనే నమ్మకంతో తెలంగాణ ప్రజలున్నారు.