రూ. 50లక్షలతో పరారీ: 6నెలలైనా అడ్రస్ లేని బీపీఎం
ములుగు సబ్ డివిజన్ పోస్టల్ శాఖలో 6నెలల క్రితం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సుమారు రూ. 40 లక్షలతో ఉడాయించగా న్యాయం కోసం నిరీక్షిస్తూ విసిగి వేసారిన బాధితులు సోమవారం సీఐకి ఫిర్యాదు చేశారు.
ములుగు: ములుగు సబ్ డివిజన్ పోస్టల్ శాఖలో ఆరు నెలల క్రితం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సుమారు రూ. 40 లక్షలతో ఉడాయించగా న్యాయం కోసం నిరీక్షిస్తూ విసిగి వేసారిన బాధితులు సోమవారం ములుగు సీఐ శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. ములుగు మండలంలోని ఖాసిందేవిపేట బ్రాంచ్ పోస్టుమాస్టర్గా పనిచేస్తున్న కవ్వంపెల్లి ప్రభాకర్ ఖాసిందేవిపేట, జంగాలపల్లి, ఇంచర్ల గ్రామాల్లో సుమారు 1600 రికరింగ్ డిపాజిట్లు (ఆర్డీ) చేయించారు.
ఒక్కో ఖాతాదారుడు నెలకు రూ. 200 నుంచి రూ. 1500 వరకు నెలనెలా తమ ఖాతాలలో పొదుపు చేసుకునే వారు. వీరిలో అత్యధికులు దినసరి కూలీలు, చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. ప్రభాకర్ను నమ్మిన ఖాతాదారులు పాసుపుస్తకాలను అతని వద్దే ఉంచి ప్రతీ నెల తమ వాటా మొత్తాన్ని చెల్లించేవారు.
అయితే ఖాతాలలో జమ చేస్తున్నట్లు మభ్యపెట్టిన ఆయన ఆ మొత్తాన్ని సొంతానికి వాడుకున్నట్లు సమాచారం. ఇలా సుమారు రూ. 50 లక్షలకు పైగా కాజేసినట్లుగా తెలుస్తోంది. 5 సంవత్సరాల గడువుతో 2010లో ఆర్డీలు చేయించగా 2015 లోనే వారు పొదుపు చేసుకున్న మొత్తానికి వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంది.
అయితే రోజులు గడుస్తున్నా ఎంతకూ డబ్బులు చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన ఖాతాదారులు ప్రభాకర్ను నిలదీశారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అప్రమత్తమైన సదరు బీపీఎం ఆరు నెలల క్రితం రాత్రికి రాత్రే కుటుంబంతో సహా ఉడాయించాడు.