అంబేడ్కర్ పేరు సరే.!అదే సచివాలయానికి దళితుడిని సీఎంగా పంపించ గలరా?కేసీఆర్ ను నిలదీసిన పొన్నాల.!
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు ఈ మధ్య దళితులపైన ఎక్కడలేని ప్రేమ, గౌరవం ఒక్కసారిగా పెరిగిపోయాయని, హఠాత్తుగా కొత్త పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. హఠాత్తుగా కొత్త సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెడతామని ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చారని, ఇవన్నీ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడంతో పాటు, రాబోయే ఎన్నికలలో దళిత ఓట్లను ఆకర్షించడానికేనన్న విషయం విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు తెలియంది కాదని పొన్నాల స్పష్టం చేసారు.
దళిత సీఎం ఏమయ్యాడు..?
కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం సబ్బండ వర్గాల మిళితం అని, అంతా కలిసి ఏకతాటిపైకి వచ్చి ఎలుగెత్తి నినదించారని, అనేక మంది దళిత, బడుగు బలహీన వర్గాలు ప్రాణ త్యాగాలు చేస్తే పోరాటం జ్వలించిందని, తెలంగాణ బిడ్డల అత్మత్యాగాలకు చలించిన యుపిఎ చైర్ పర్సన్ శ్రీమతి సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేశారని పొన్నాల లక్ష్మయ్య గుర్తు చేసారు. తెలంగాణ ఏర్పాటు కాగానే మాయ మాటలతో నక్క జిత్తులతో మోసాలు చేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందలం ఎక్కారని పొన్నాల ఆగ్రహం వ్యక్తం చేసారు.
సచివాలయానికి అంబేడ్కర్ పేరు..
అంతే కాకుండా తెలంగాణ ఏర్పాటయితే తొలి ముఖ్య ముఖ్యమంత్రి ఒక దళిత నాయకుడే ఉంటారు అని మాయ మాటలు చెప్పి పచ్చి మోసం చేసి ఎన్నికల తంతు ముగిసిన వెంటనే చంద్రశేఖర్ రావే ముఖ్య మంత్రి అయ్యారని అన్నారు. ఒక దళిత నేత రాజయ్యను ఉప ముఖ్యమంత్రిగా చేసినా ఏవో అవినీతి ఆరోపణల నెపంతో ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేశారు. దాదాపు 6 ఏళ్ళు అవుతున్న ఆయనను ఎందుకు బర్తరఫ్ చేసారో చెప్పకపోగా, అంత పెద్ద నేరం ఏం చేశారో చెప్పలేదని సీఎం పై పొన్నాల మండిపడ్డారు.
సచివాలయానికి అంబేడ్కర్ పేరు సరే..
అలాగే దళిత కుటుంబాలకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చి వారు ఆర్థికంగా నిలదొక్కుకునే ఏడాది పాటు వ్యవసాయ వ్యయం ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారని, కానీ 8 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఎంత భూమి దళిత రైతులకు పంపిణీ చేశారని, భూమి లేని కుటుంబాలు సుమారు పది లక్షలు ఉంటాయని సీఎం స్వయంగా స్పష్టం చేసారని పొన్నాల గుర్తు చేసారు. అలాగే రాష్ట్రంలో పేదలు ఆత్మగౌరవంతో బతికేలా చేస్తామని ప్రతి ఇల్లు లేని కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ప్రకటించారని, 8ఏళ్ల కాలంలో ఎన్ని ఇళ్లు ఇచ్చారో, ఎంత మంది దళిత కుటుంబాలు సొంత ఇంటి వారు అయ్యారో ప్రకటించాలని పొన్నాల డిమాండ్ చేసారు.
దళిత బంధు అమలవుతోందా.?
గత హుజురాబాద్ ఎన్నికల ముందు రాష్ట్రంలో ఏకంగా దళిత బంధు అనే పథకాన్ని ప్రారంభించారని, ఎంతమంది దళితులు సొంత వ్యాపారాలు పెట్టుకొని ఆర్థిక స్తోమత సాదించారో ప్రకటించాలన్నారు పొన్నాల. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దళిత వాడలు, గిరిజన తండాలలో అభివృద్ధి కార్యక్రమాలు నిధుల కొరత లేకుండా జరగాలని ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొచ్చామని, కానీ మీరు క్యారి ఓవర్ నిబంధన తీసుకొచ్చి ఇప్పటి వరకు 65 వేల కోట్ల రూపాయలు విడుదల చేయకుండా ఆపేసి తీవ్రంగా నష్టం చేశారని పొన్నాల మండి పడ్డారు.
ఇక ఉద్యోగాల ప్రకటనలో తీవ్ర జాప్యం జరుగుతోందని, సుమారు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అవి సకాలంలో భర్తీ చేసి ఉంటే దాదాపు 40 వేల మంది దళిత నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి వారి కుటుంబాలు ఆత్మగౌరవం తో బతికేవని పొన్నాల తెలిపారు.