సినిమా చాన్స్ ఇప్పిస్తానని మోసం, యువతి పట్ల అసభ్యంగా...
హైదరాబాద్: సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానంటూ ఓ యువతిని మోసం చేయడమే కాకుండా డబ్బులు తీసుకుని, అసభ్యంగా ప్రవర్తించిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై నిర్భయ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం - సినిమాల్లో నటించే ఆసక్తితో పి.విజయలక్ష్మి(35) ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి హైదరాబాదులోని మణికొండలో నివాసం ఉంటోంది.
ఈ క్రమంలో రాజీవ్గాంధీనగర్కు చెందిన కోటేశ్వరరావు(35) అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆమెకు పరిచయమయ్యాడు. తనకు సినిమా ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయని, నిర్మాతలు, దర్శకులంతా తన స్నేహితులని నమ్మించాడు. అయితే, అందుకు కొంత డబ్బు ఖర్చవుతుందని చెప్పడంతో విజయలక్ష్మి 2010లో రూ. 3 లక్షలు ఇచ్చింది.
అప్పటి నుంచి కోటేశ్వరరావును ఎన్నిసార్లు ప్రశ్నించినా సినిమాల్లో వేషాలు ఇప్పించక పోగా, డబ్బులు అడిగినప్పుడల్లా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై నిర్భయ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జిమ్లో యువకుడి మృతి
వ్యాయమ శాలలో విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన బోయిన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ కె.కిరణ్కుమార్ కథనం ప్రకారం - సికింద్రాబాదులోని న్యూ బోయిన్పల్లి పెన్షన్లైన్కు చెందిన దావుద్ మహ్మద్ఖాన్(16) పదో తరగతి వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం దావుద్ ఖాళీగానే ఉంటూ పోలీస్స్టేషన్ ముందు ఉన్న జిమ్(వ్యాయమశాల)లో ప్రతి రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఎక్సర్సైజ్ చేసేందుకు జిమ్కు వెళ్లాడు. జిమ్లోని పరికరాలతో వ్యాయామం చేస్తూ.. అక్కడ ఉన్న ఓరాడ్ను ముట్టుకున్నాడు. ఆ రాడ్కు విద్యుత్ సరఫరా అయి షాక్ కొట్టింది. దీంతో దావుద్ కుప్పకూలాడు. గమనించిన జిమ్ నిర్వాహకుడు దావుద్ను బాలనగర్లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
పరీక్షించిన వైద్యులు దావుద్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న దర్యాప్తు జరిపారు. పోస్టుమార్టం నిమిత్తం దావుద్ మృతదేహన్ని గాంధీ వైద్యశాలకు తరలించారు. మంగళవారం పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై సురేష్ కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.