కలెక్టర్తో అసభ్య ప్రవర్తన: ఎమ్మెల్యే శంకర్పై కేసు నమోదు, స్టేషన్ బెయిల్
ఎమ్మెల్యే శంకర్నాయక్ జిల్లా కలెక్టరు డాక్టర్ ప్రీతీమీనా పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై కలెక్టరు ఫిర్యాదు మేరకు శాసనసభ్యుడు శంకర్నాయక్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మహబూబాబాద్: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే శంకర్నాయక్ జిల్లా కలెక్టరు డాక్టర్ ప్రీతీమీనా పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై కలెక్టరు ఫిర్యాదు మేరకు శాసనసభ్యుడు శంకర్నాయక్పై పోలీసులు మహబూబాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆయనపై 353, 354 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
గురువారం ఉదయం ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆయనకు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. బెయిల్ రావడంతో ఆయన మహబూబాబాద్ క్యాంప్ ఆఫీస్ చేరుకున్నారు.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బుధవారం మహబూబాబాద్లో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే శంకర్నాయక్తో పాటు కలెక్టర్ ప్రీతీమీనా పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో వేదికపైకి వెళ్తున్న క్రమంలో ఎమ్మెల్యే శంకర్నాయక్ కలెక్టరు చెయ్యి పట్టుకోవడంతో ఆమె తీవ్ర అసహనానికి గురయ్యారు.

ఈ విషయాన్ని వెంటనే మంత్రి చందూలాల్కు వివరించగా ఆయన స్పందించనట్లు సమాచారం. దీంతో ఆమె రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్కు, ఐఏఎస్ల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కొంతకాలంగా తన పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని ఆమె పేర్కొన్నట్లు తెలిసింది. ఆయన వైఖరితో తాను ఇబ్బంది పడుతున్నానని వెల్లడించినట్లు తెలిసింది
సీఎస్, ఐఏఎస్ అధికారుల సంఘం ప్రతినిధులు వెంటనే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తూ వెంటనే ఫోన్ చేసి శంకర్నాయక్పై ఆగ్రహం వెళ్లగక్కారు. కలెక్టరును కలిసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. తీరు మార్చుకోకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.
ఈ విషయంలో కలెక్టరుతో మాట్లాడి సముదాయించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్లకు పురమాయించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి శంకర్నాయక్ను పిలిచి మాట్లాడి కలెక్టరుకు క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు.
కలెక్టరు ప్రీతీమీనాను సంప్రదించి.. జరిగిన సంఘటనపై ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటివి మళ్లీ జరగనీయబోమని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి చందూలాల్, ఎంపీ సీతారాంనాయక్ కలెక్టరు ఇంటికెళ్లారు. సుమారు గంటన్నరపాటు సంప్రదింపులు జరిపారు.

అప్పటిదాకా ఎమ్మెల్యే శంకర్నాయక్ కలెక్టరు ఇంటి బయటే వేచి ఉన్నారు. కొంతసేపటికి లోపలి నుంచి కబురు రావడంతో ఇంట్లోకి వెళ్లిన ఆయన ఆమెకు క్షమాపణ చెప్పారు. ఆమె తనకు సోదరితో సమానమని, అనుకోకుండా చేయి తగిలి ఉండొచ్చంటూ మీడియాకు తెలిపారు. అందుకు ఆమెను క్షమాపణలు కూడా కోరినట్లు తెలిపారు. కాగా, శంకర్నాయక్ అంశంపై గురువారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఇకపై ఎక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయాలని వారు నిర్ణయించారు.
Recommended Video













Click it and Unblock the Notifications