సండ్రకు బెయిల్: 28న ఫిర్యాదు, 31న ఎఫ్ఐఆర్పై లాయర్ ప్రశ్న
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఎసిబి న్యాయస్థానం మంగళవారం నాడు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.2 లక్షల పూచీకత్తు సమర్పించాలని, నియోజకవర్గం దాటి వెళ్లవద్దని కోర్టు షరతులు విధించింది.
సండ్ర బెయిల్ పిటిషన్ పైన సోమవారం నాడు ఇరువైపుల వాదనలు ముగిశాయి. ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ నివేదికతోనే సండ్ర పాత్ర వెలుగులోకి వచ్చిందని, ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని ఎసిబి తరఫు న్యాయవాది సురేంద్ర రావు వాదించారు.
ముఖ్య నిందతుల్లో ఆయన ఒకరని చెప్పారు. బయటకు వస్తే దర్యాఫ్తుకు ఆటంకం కలుగుతుందన్నారు. కేసు కీలక దశలో ఉన్నదని, ఇలాంటి సమయంలో బెయిల్ వద్దని చెప్పారు. ప్రధాన కుట్రదారు సండ్రనే అని చెప్పారు.
అంతకుముందు సండ్ర తరఫు న్యాయవాది రవీంద్ర కుమార్ తన వాదనలు వినిపించారు. సండ్రను రాజకీయ కుట్రతోనే కేసులో ఇరికించారని చెప్పారు. మే 28వ తేదిన ఫిర్యాదు అందితే, 31న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అందులో సండ్ర పేరు లేదని గుర్తు చేశారు.
విచారణకు అన్ని రకాలుగా సండ్ర సహకరించారని చెప్పారు. సండ్రకు సంబంధించి ఇంకెవర్నీ విచారించే అవసరం లేదన్నారు. విచారణ నిమిత్తం ఎప్పుడు అవసరమైన హాజరవుతారని చెప్పారు. సండ్రకు బెయిల్ నిరాకరణకు ఎసిబి చెబుతున్న 7 కారణాలు అర్థరహితమన్నారు.