ఆ వ్యాఖ్యలపై యాదవుల ఆగ్రహం: దిగొచ్చిన చాగంటి
యాదవుల ఆగ్రహానికి చాగంటి కోటేశ్వర రావు దిగివచ్చారు. తాను చేసిన వ్యాఖ్యను వెనక్కి తీసుకుంటానని చెప్పారు. దానిపై వివరణ కూడా ఇస్తానన్నారు.
హైదరాబాద్: యాదవుల అగ్రహానికి ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వర రావు దిగొచ్చారు. ఆయన ప్రవచనాలకు పెట్టింది పేరనే విషయం తెలిసిందే. భారతం, భాగవతంలోని పలు సంఘటనలను ప్రవచనాల రూపంలో చెబుతుంటారు. సందర్భానుసారంగా పౌరాణిక ఘట్టాలను గుర్తుచేస్తూ వీక్షకులకు అర్థమయ్యే రీతిలో ప్రవచిస్తుంటారు.
అయితే ఈ మధ్య చాగంటి తన ప్రవచనాల్లో యాదవులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. పలువురు యాదవ ప్రముఖులు కూడా చాగంటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే యాదవ సంఘం సభ్యులు కొంతమంది చాగంటి కోటేశ్వరరావు ఇంటికి వెళ్లి వివరణ కోరారు. తన వ్యాఖ్యలపై యాదవ సంఘం సభ్యులకు చాగంటి వివరణ ఇచ్చారు.
ప్రవచనాల్లో తమను గొల్లలు అనకుండా యాదవులు అని సంబోధించాలని చాగంటిని యాదవ సంఘం సభ్యులు కోరారు. తప్పకుండా అలాగే చెప్తానని అన్నారు. యాదవుల మీద తనకు పరమపూజ్య భావన ఉందని, తనకు అసలు యాదవులంటే ఉన్నంత ప్రీతి ఎవరిమీదా లేదని చాగంటి చెప్పారు.
యాదవుల మీద తనకు ప్రేమ ఒక్కటే ఉందని, కావాలంటే యాదవులను కౌగిలించుకుంటానని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు. ఏ ఛానెల్లో అయితే తన ప్రవచనాలను చూసి బాధపడుతున్నారో అదే ఛానెల్లో వివరణ కూడా ఇస్తానని చాగంటి చెప్పారు.