వదులుకోను, భయపడేది లేదు, అధైర్యపడొద్దు: చంద్రబాబు, ఆర్ కృష్ణయ్య డుమ్మా
హైదరాబాద్: గెలిపించినవారు పార్టీని వీడితే బాధగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తనకు పార్టీ ముఖ్యం గానీ నాయకులు కాదని ఆయన అన్నారు. టిడిపి తెలంగాణ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన గురువారం సాయంత్రం ప్రసంగించారు. నాయకులు పోయినా పార్టీ పోదని ఆయన అన్నారు.
పార్టీని వదులుకోవడానికి తాను సిద్ధంగా లేనని ఆయన చెప్పారు. ఒకరిద్దరు పోయినంత మాత్రాన పార్టీకి ఏమీ కాదని ఆయన అన్నారు. జరుగుతున్న పరిణామాలకు భయపడేది లేదని ఆయన అన్నారు. తాను ఇక్కడి ఉండాలని పార్టీ నాయకులు కోరినందుకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. నాయకత్వాన్ని పెంచుకుందామని, కార్యకర్తల బలాన్ని పెంచుకుందామని ఆయన చెప్పారు. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకున్నప్పుడే నాయకత్వ ప్రతిభ బయటపడుతుందని ఆయన చెప్పారు.
Photos: తెరాసలో చేరాక ఎర్రబెల్లి
2014 ఎన్నికల్లో టిడిపి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 14 శాసనసభా స్థానాలు గెలిచిందని, తెరాస రెండు మాత్రమే గెలిచిందని, కానీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస విజయం సాధించిందని, రాజకీయాల్లో అది సహజమని ఆయన అన్నారు. ఎపిలో నష్టపోయినా 2014లో గెలిచామని ఆయన చెప్పారు. టిడిపికి ఉన్నది కార్యకర్తల బలమేనని ఆయన చెప్పారు.
33 ఏళ్ల పార్టీ టిడిపి అని, తగిన సమయంలో పార్టీ నాయకులకు ఏం చేయాలో చేస్తానని, పార్టీని కాపాడుకోవడానికి సహకరిస్తామని ఆయన చెప్పారు. అధైర్యపడవద్దని, పార్టీ భవిష్యత్తు కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు 1985లో బిజెపి రెండు స్థానాలు మాత్రమే గెలిచిందని, కానీ రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఆయన చెప్పారు.
పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తామని, అన్నింటి కన్నా పార్టీ ముఖ్యమని, పార్టీ బలంగా ఉంటేనే మనం ఉంటామని ఆయన చెప్పారు. భయపడాల్సిన అవసరం లేదని, పార్టీకి కార్యకర్తలు ఉన్నారని ఆయన చెప్పారు.
ఈ విస్తృత స్థాయి సమావేశానికి ఎల్బీ నగర్ శాసనసభ్యుడు ఆర్. కృష్ణయ్య హాజరు కాలేదు. కాగా, ఫిరాయించగా మిగిలిన మిగతా ఐదుగురు శాసనసభ్యులు రేవంత్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, అరికెపూడి గాంధీ, సండ్ర వెంకటవీరయ్య, మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు. అలాగే పార్టీ నాయకులు ఎల్. రమణ, ఉమా మాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, గరికపాటి, రావుల చంద్రశేఖర రెడ్డి, పార్లెమంటు సభ్యుడు మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు.