అమరావతి ఆహ్వాన పత్రికతో 18వ తేదీన కెసిఆర్ వద్దకు చంద్రబాబు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆహ్వానించనున్నారు. ఇందుకు గాను ఆయన ఈ నెల 18న కెసిఆర్ను కలుస్తారు.
తెలుగువారందరికీ ప్రతిష్ఠాత్మకమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ ఇంటికివెళ్ళి ఆహ్వానిస్తానని చంద్రబాబు చెప్పిన విషయం తెలిసిందే. దీనికి ఈ నెల 18న ఆయన ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. అదే రోజు ఆయన రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను, ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావును కలిసి ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించనున్నారు.

అదేరోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబాసాహెబ్ భోసలేని కూడా తానే ఆహ్వానించాలని చంద్రబాబు భావించారు. కానీ బుధవారమే ప్రధాన న్యాయమూర్తి బయటకు వెళ్తున్నారు. దీంతో ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తిని మంగళవారం ఆయన నివాసానికి పంపి ఆహ్వాన పత్రిక అందచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన వేడుకకు ఆహ్వానం వస్తే తాము వెళ్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం నాడు చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి కెసిఆర్ వెళ్తారా లేక మంత్రులు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.ఏపీ ప్రజలతో తమకు ఎలాంటి పంచాయతీ లేదని కెటిఆర్ అన్నారు.












Click it and Unblock the Notifications