భార్యను మిస్సవుతున్నా, లోకేష్పై చూద్దాం: చంద్రబాబు
హైదరాబాద్: రాష్ట్రం కోసం తాను బస్సులో పడుకున్నానని, బస్సు నుంచే కార్యకలాపాలు నిర్వహించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతి పూర్తిస్థాయిలో నిర్మాణం జరగడానికి సమయం పడుతుంది కాబట్టి తాత్కాలిక రాజధానిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యుూలో ఆయన వివిధ విషయాలపై మాట్లాడారు. రాష్టం కోసం తాను త్యాగం చేస్తున్నానని ఆయన చెప్పారు. తన భార్యను మిస్సవుతున్నానని, మనవడికి సమయం వెచ్చించలేకపోతున్నానని ఆయన చెప్పారు. వ్యాపార రీత్యా తన భార్య భువనేశ్వరి హైదరాబాదులో ఉంటున్నారని, మనవడు కూడా హైదరాబాదులో ఉంటున్నాడని ఆయన అన్నారు. అయితే రాష్ట్రం కోసం త్యాగం చేస్తున్నాననే సంతృప్తి ఉందని చెప్పారు.
తన కుమారుడు నారా లోకేష్ను మంత్రివర్గంలో చేర్చుకునే విషయంపై కూడా ఆయన మాట్లాడారు. చూద్దామని అన్నారు. ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుందని అన్నారు. మంత్రులు మీ అంచనాలను అందుకోలేకపోతున్నారా అడిగితే మీరు అందుకోగలుగుతున్నారా అని మీడియా ప్రతినిధిని అడిగారు. హయ్యెస్ట్ బెంచ్ మార్కు ఉంటుందని, తాను అత్యున్నత ప్రమాణాలను పెట్టుకున్నానని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండేళ్ల పసిబిడ్డ అని, రెండేళ్ల పసిబిడ్డను కాపాడుకునే కన్నా ఎక్కువగా కష్టపడాల్సి వస్తోందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రానికీ ఇంత కష్టం రాలేదని చెప్పారు. ఐదు కోట్ల ప్రజలను కట్టుబట్టలతో నడిరోడ్డున పడేశారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా కావాలని బిజెపి పార్లమెంటులో పట్టుబట్టిందని, హామీ ఇచ్చారు గానీ చట్టంలో చేర్చలేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో అనవసరమైన విమర్శలు చేస్తున్నారని అంటూ తనకు మాత్రం ప్రత్యేక హోదా రావాలని ఉండదా అని అడిగారు.
అరాచాకాలకు శ్రీకారం చుట్టి అడ్డంగా, అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారని ఆయన విమర్శించారు. అన్యాయం నుంచి కోలుకోలేని స్థితిలో ఉన్నామని ఆయన చెప్పారు. కేంద్రం చేయాల్సిందే చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు సాయం చేయాలని ఆయన అన్నారు.
తనకు అనుభవం ఉంది కాబట్టే నిలదొక్కుగలిగామని, ఇతరులు వస్తే రాష్ట్రం పరిస్థితి ఏమయ్యేదో ఊహించేందుకు వీలు కాదని అన్ారు. అమరావతి నిర్మాణంపై వస్తున్న విమర్శలపై ఆయన ప్రతిస్పందించారు. మాట్లాడేవారు ఏదైనా మాట్లాడవచ్చు, అడ్డదిడ్డంగా మాట్లాడుతారని అన్నారు. అమరావతిని ఆర్థిక కేంద్రంగా తయారు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అయోమయం పరిస్థితిని దాటుకుని ఓ స్థిరమైన పరిస్థితికి వచ్చామని చెప్పారు.
జగన్ మార్కు వ్యక్తి రాకూడదని పశ్చిమ గోదావరి నుంచి ఏజెన్సీ ప్రాంత ప్రజలు తమకు ఏకపక్షంగా ఓటేశారని ఆయన చెప్పారు. జగన్ 11 కేసుల్లో ముద్దాయి తన గురించి మాట్లాడుతున్నాడని అన్నారు. 2050 వరకు తమ పార్టీ అధికారంలో ఉండాలన్నది తమ ఉద్దేశమని, అది రాష్ట్రం కోసమని అన్నారు. రాష్ట్రంలో అభద్రతా భావం సృష్టించాలని ప్రయత్నించారని ఆయన విమర్శించారు.
తనకు ఢిల్లీ మీద శ్రద్ధ లేదని, తన దృష్టంతా రాష్ట్రాభివృద్ధి మీదనే ఉందని చెప్పారు. విభజన సమయంలో స్పష్టత ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు. ఢిల్లీ మూడ్ ఎలా ఉందని ప్రశ్నిస్తే తన ప్రయత్నాలు తాను చేస్తానని చెప్పారు. బిజెపి తనపై చేస్తున్న విమర్శలపై వేసిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ కౌంటర్ చేయడం కాదు గానీ పిపిపిప్రాజెక్టులు అన్నీ కలిపి కేంద్రం ఇచ్చిందని చెబుతున్నారని ఆయన అన్నారు.
అయితే, విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేస్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని తాను కోరుతున్నానని, ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరి కాదని, ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు రాష్ట్రానికి కేంద్రం సహకరించాలని ఆయన అన్నారు. తుని ఘటనపై విచారణ జరుగుతోందని, కాపులకు వైయస్ రాజశేఖర రెడ్డి చేసిందేమీ లేదని అన్నారు.