మోడీ అనూహ్యం, గందరగోళం: ఏటీఎంలలో డిపాజిట్, డ్రా చేసేందుకు భయం
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల పైన ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు సంచలన ప్రకటన చేశారు. ఈ నోట్లను రద్దు చేస్తున్నట్లు మోడీ అనూహ్యంగా ప్రకటించారు. అలాగే రెండు రోజుల పాటు ఏటీఎంలు బందు ఉండనున్నాయి.
ఇక నుంచి ఏటీఎం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు రావు. అలా డ్రా చేయడం కుదరదు. కేవలం రూ.2వేలు మాత్రమే తీసుకునే అవకాశముంది. అయితే కొద్ది రోజుల తర్వాత నుంచి మాత్రం రూ.4వేలు తీసుకునే వెసులుబాటు లభిస్తుంది.
పలు దుకాణాలలో రూ.500, రూ.1000 ఎవరైనా కస్టమర్లు ఇస్తే ఈ రాత్రి నుంచే దుకాణదారులు తీసుకోవడం లేదు.
కాగా, రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడానికి ఏటీఎంలు పని చేయకపోవడానికి కారణం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. 48 గంటల పాటు ఏటీఎంలు పని చేయవనేది అందరికీ ఇబ్బందికర విషయమని చెబుతున్నారు. ఇది ఎవరికైనా కష్టమే అంటున్నారు. కాగా, ఇప్పటికే ఏటీఎంలలో డబ్బులు పెట్టడం తదితర కారణాల వల్ల ఆ డబ్బులు వినియోగదారులకు వెళ్లకుండా ఏటీఎంలు బంద్ చేస్తున్నారేమో అంటున్నారు.
రూ.500, రూ.1000 నోట్ల రద్దు: సంచలన నిర్ణయంపై ఫలించిన బాబు పోరాటం
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం నాడు హఠాత్తుగా రూ.500, రూ.1000 నోట్లను ఈ రోజు అర్ధరాత్రి నుంచి చెల్లవని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అందరిలోను గందరగోళానికి తెరలేపింది.
ఏటీఎంల వద్ద క్యూ
రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని ప్రకటించిన నేపథ్యంలో ఏటీఎంల వద్ద హఠాత్తుగా క్యూలు ప్రారంభమయ్యాయి. చాలామంది తమ వద్ద ఉన్న డబ్బులను (రూ.500, రూ.1000 నోట్లు) ఏటీఎం మెషీన్లలో వేసేందుకు వచ్చారు. ఎవరైనా డబ్బులు డ్రా చేసేందుకు భయపడుతున్నారు. రూ.500, రూ.1000 నోట్లు వస్తాయేమోనని భయపడి తీయడం లేదు.
ఏటీఎం రెండు రోజుల పాటు బంద్ నేపథ్యంలో రేపటి అవసరాల కోసం (ప్రభుత్వ కార్యాలయాలలో ఇవ్వవచ్చునని ఆర్బీఐ తెలిపింది) కొందరు డబ్బుల కోసం క్యూ కట్టారు.
మరికొన్ని విషయాలు
రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయడంతో పాటు బ్యాంకు నుంచి నగదు ఉపసంహరణ విషయంలో పలు ఆంక్షలు ఉంటాయని ప్రధాని మోడీ చెప్పారు. బ్యాంకు నుంచి రోజుకు రూ.10వేల వరకు మాత్రమే ఉపసంహరించుకోవచ్చుని, వారానికి నగదు ఉపసంహరణ రూ.20వేలు వరకు అని తెలిపారు. ఇంటర్నెట్ బ్యాకింగ్ లావాదేవీల పైన ఎలాంటి షరతులు లేవు. డీడీల ద్వారా బదలీల పైన ఎలాంటి పరిమితి ఉండబోదు.