ఆ 5 లక్షల కుక్కల మధ్యలో మేయర్ను వదిలేయండి: బాలుడి ఘటనపై రాంగోపాల్ వర్మ
హైదరాబాద్ నగరంలోని అంబర్పేటలో ఇటీవల వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు.
హైదరాబాద్: నగరంలోని అంబర్పేటలో ఇటీవల వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కోల్పోయిన ఘటన అందర్నీ కలిచివేసింది. ఈ ఘటనపై నలువైపుల నుంచి పాలకవర్గంపై ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై రాంగోపాల్ వర్మ ఫైర్
వీధి కుక్కల నియంత్రణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) విఫలమైందంటూ విమర్శించారు. కుక్కలకు ఆకలి వేయడం వల్లే చిన్నారిపై దాడి చేశాయి అని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇచ్చిన వివరణపై రాంగోపాల్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు. గతంలో విజయలక్ష్మి తన పెంపుడు కుక్కతో కలిసి ఉన్న వీడియోను షేర్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
చెత్త సలహాలంటూ మేయర్పై వర్మ ఘాటు స్పందన
'కుక్కల నుంచి ప్రజలకు హాని కలగకుండా ఉండాలంటే మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి నా ఆలోచన చెబుతా. నగరంలోని అన్ని శునకాలకూ ఈ వీడియో చూపిస్తే.. ఆకలి వేసినప్పుడల్లా, చిన్నారులపై దాడి చేయకుండా మేయర్ ఇంటికి వెళ్తాయి. అలాగే, ఆ హృదయ విదారక వీడియోను ఆమెకు తరచూ చూపించాలి. అప్పుడు ఆమె చెత్త సలహాలు ఇవ్వకుండా ఉంటారు' అంటూ ఘాటుగా స్పందించారు ఆర్జీవి.
5 లక్షల కుక్కల మధ్యలో మేయర్ను వదిలేయాలంటూ కేటీఆర్ కు ఆర్జీవీ
'కేవలం మేయర్ మాత్రమే కాదు. అందరూ ఆ స్థానంలో మీ పిల్లలను ఊహించుకోండి. 2021లో గద్వాల్ విజయలక్ష్మి పెట్టిన వీడియో ఇప్పుడు 2023లో భయానక స్థితికి చేరింది. చిన్నారిపై దాడి చేసిన కుక్కలకు బహుశా ఆమే శిక్షణ ఇచ్చి ఉంటారన్న అనుమానం కూడా కలుగుతోంది. మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీసులు దీనిపై విచారణ చేయాలి. ఇంత జరిగినా ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ గద్వాల్ విజయలక్ష్మి తన మేయర్ పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదు? ఆ రౌడీ/గూండా కుక్కలను మీ ఇంటికి తీసుకెళ్లి వాటికి ఆహారం పెట్టవచ్చు కదా! అప్పుడు అవి మన పిల్లలను తినకుండా ఉంటాయి. కేటీఆర్ సర్ దయచేసి నగరంలో ఉన్న 5 లక్షల కుక్కలను డాగ్ హోంకు తరలించి.. వాటి మధ్యలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని వదిలేయండి' అని రాంగోపాల్ వర్మ తీవ్రంగా స్పందించారు. కుక్కల నియంత్రణకు ప్రభుత్వం ఖర్చు పెడుతున్న రూ. 18 కోట్లు ఏమవుతున్నాయని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications