ప్రాణముండగా తెరాసలో చేరను: జానా, ఆంధ్రోళ్లు అని..: కెసిఆర్కు హెచ్చరిక
హైదరాబాద్: తాను బొందిలో ప్రాణం ఉండగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనని, అధికార పార్టీ మైండ్ గేమ్ ఆడుతోందని కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి గురువారం అన్నారు. తాను పార్టీ మారుతానని సొంత వాళ్లే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
తన పైన వచ్చిన ఆరోపణలను తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పైన తాము సుప్రీం కోర్టుకు వెళ్తామని చెప్పారు. ఇందుకు ఖర్చును సీఎల్పీ భరించాలని చెప్పారు.
ఎవరికైనా పార్టీ వీడే ఆలోచన ఉంటే చెప్పాలని జానా రెడ్డి ప్రశ్నించారు. అలాగే, తన నాయకత్వం పైన అనుమానాలు ఉంటే చెప్పాలన్నారు. తాను సిఎల్పీ నాయకత్వాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సమన్వయం చేసే వారు ఎవరైనా ముందుకు వస్తే నేను పదవి వదులుకుంటానని చెప్పారు.
దానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... మీరే ఉండాలని చెప్పారు. మీరు ఎమ్మెల్యేలను సమన్వయం చేస్తారని చెప్పారు.
ఆంధ్రోళ్లు అని చెప్పిన కెసిఆర్..: సంపత్ కుమార్
ముఖ్యమంత్రి కెసిఆర్ పైన కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మండిపడ్డారు. ఆర్టీఎస్ పనులు పూర్తి చేయాలని, లేదంటే మే 9న పదివేల మంది రైతులతో ఆర్డీఎస్ ముట్టడిస్తామని సంపత్ కుమార్ ప్రభుత్వానికి హెచ్చరించారు.
ఆంధ్రోళ్లు నిధులు ఇవ్వడం లేదని ఉద్యమం సమయంలో విమర్శించిన కేసిఆర్ ఇప్పుడు ఒక్క లక్ష రూపాయలు కూడా అదనంగా ఇవ్వలేదని ఆరోపించారు. తమకు జానా రెడ్డి నాయకత్వంపై నమ్మకం ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు పార్టీ మారడంలో పీసీసీ, సీఎల్పీ లోపం లేదని చెప్పారు.