ప్రారంభం: యాగస్థలికి చేరుకున్న సీఎం కేసీఆర్ దంపతులు, హాజరైన గవర్నర్
హైదరాబాద్: లోక కల్యాణం కోసం మెదక్జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన అయుత మహా చండీయాగం మరికాసేపట్లో వేద పండితుల మంత్రోచ్ఛరణాల మధ్య ప్రారంభం కానుంది. ఈ క్రమంలో యాగస్థలికి సీఎం కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు.
సీఎం కేసీఆర్ దపంతులకు వేద పండితులు ఘనస్వాగతం పలికారు. తొలుత రుత్విజులతో కలిసి సీఎం కేసీఆర్ దంపతులు యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు. వేదఘోషతో యాగస్థలి ప్రతిధ్వనిస్తుంది. యాగం కోసం దేశ వ్యాప్తంగా నలుమూలల నుంచి రెండు వేల మంది రుత్విజులు వచ్చారు.
చండీయాగం ప్రారంభోత్స సందర్భంగా తొలిరోజున జరిగే క్రతువులో కేసీఆర్తో పాటు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు హాజరయ్యారు. తెలంగాణ మంత్రులు హరీష్రావు, కేటీఆర్లు గవర్నర్కు స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ దంపతులను సీఎం కేసీఆర్ యాగశాలకు ఆహ్వానించారు.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ భోసలే, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులు కూడా తొలిరోజున హాజరుకానున్నారు. బుధవారం నుంచి ఈ నెల 27 వరకు చండీయాగం జరగనుంది. శృంగేరి శారదా పీఠం నుంచి ఇక్కడి నుంచి వచ్చిన 6గురు ప్రధాన రుత్విజుల పర్యవేక్షణలో ఈ యాగం జరగుతుంది.
108 హోమగుండాలతో పాటు చతుర్వేద యాగశాలల్లో రాజశ్యామల, మహారుద్ర, అయుత మహా చండీయాగం జరగుతుంది. అయుత మహా చండీయాగంలో భాగంగా మొదటిరోజైన ఈరోజు వెయ్యి చండీ పారాయణాలు, 40లక్షల నవార్ణమంత్ర జపాలు చేస్తారు. కాగా ఆయుత చండీయాగం జరిగే ఎర్రవల్లిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
యాగాన్ని తిలకించేందుకు విచ్చేస్తున్న ప్రముఖులు, ఆధ్యాత్మిక వేత్తల రాకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. యాగశాల వద్ద 4వేల మంది తిలకించే విధంగా ఏర్పాట్లు చేశారు. రోజూ 50వేల మందికి అన్నదానం చేసే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. దాదాపు 3,300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. యాగశాల చుట్టూ 5కిలోమీటర్ల వరకు సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.