ధరణిపై పట్టువీడని కేసీఆర్..విపక్షాలకు స్ట్రాంగ్ వార్నింగ్..!
''ధరణిని ఎవరైతే బంగాళాఖాతంలో వేస్తా అని చెప్పారో వాళ్లు వేసేది ధరణిని కాదు.. రైతులను వాళ్లు బంగాళాఖాతంలో వేస్తున్నట్టే. కొంతమంది గొడ్డలి భుజం మీద పెట్టుకొని తయ్యార్గా ఉన్నరు. నమ్మి ఒకవేళ అధికారం ఇచ్చినమో.. పంటికి అంటకుండా మింగేస్తరు. జాగ్రత్త!'' అని సీఎం కేసీఆర్ అన్నారు.
ధరణి పోర్టల్ విషయంలో ప్రతిపక్షాలు, మీడియా ఎన్నిరకాల విమర్శలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పట్టు విడవడం లేదు. ఎవరేమి అనుకున్నా ధరణి కొనసాగుతుందని ఆయన గట్టిగానే చెబుతున్నారు. ఒకప్పటి తెలంగాణ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ, ప్రస్తుత సీఎం సలహాదారు సోమేష్కుమార్ ప్రత్యేకంగా రూపొందించిన ధరణి పోర్టల్ తెలంగాణలో ఒక సంచలనంగా మారింది. భూ రికార్డులు పకడ్బందీగా పోర్టల్లో పొందుపరిచారు.

దళారులు, కబ్జాదారులు భూముల జోలికి వచ్చినా ధరణిలో పేరు మార్పు సాధ్యంకాని పరిస్థితి ఇప్పుడుంది. రైతులతో సహా ఎవరైనా భూమి అమ్మాలన్నా, కొనాలన్నాఇప్పుడు ధరణి ద్వారానే సాధ్యమవుతోంది. గతంలో ఇదే పనుల కోసం రైతులు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగేవాళ్లు. పాత పద్ధతుల్లో భూములు రిజిస్ట్రేషన్ అయితే పట్టా రావడానికి మూడునెల్లకో.. ఆరు నెలలో పట్టేది. వీఆర్వో, ఎమ్మార్వో చేతిలో దస్త్రం ఉండటం వల్ల ప్రభుత్వ రికార్డులు రాత్రికి రాత్రి తారుమారయ్యేవి. ఈ అధికారాన్ని ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్ ద్వారా ప్రజల చేతికి ఇచ్చింది.
ధరణితో రికార్డుల తారుమారుకు చెక్ : ఇవ్వాళ ఒక్కసారి ధరణిలో నమోదైన వివరాలు మార్చే అధికారం వీఆర్వో దగ్గర నుంచి సీఎం వరకూ మార్చే పరిస్థితి లేకుండా చేశారు. ఆ భూమి వివరాలు మారాలంటే, ఆ రైతు భూమిని అమ్మినప్పుడు మాత్రమే సాధ్యమయ్యే విధంగా ధరణి పోర్టల్ను పకడ్బందీగా రూపొందించారు. ధరణితో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చాలా సులభతరం అయ్యింది. స్లాట్ బుక్ చేసుకుని.. వెళితే కేవలం 20 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ అయిపోతోంది.
పాస్బుక్కు అదే రోజు చేతికి అందుతోంది. ఎవరి చుట్టూ తిరిగే పనిలేదు, ఎవరికి లంచం ఇచ్చే అవసరం లేదు, ఏ నాయకుడి పైరవీ అక్కర్లేదు. అందుకే కేసీఆర్ ప్రభుత్వం ఎవరెన్ని విమర్శలు చేసినా, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నిసార్లు ధరణిపై దుమ్మెత్తిపోసినా స్పందించడం లేదు.

ధరణి లేకుంటే దళారులదే రాజ్యం : ధరణిపై విపక్షాల ఆరోపణలు దళారుల శాపాలంటూ నాగర్ కర్నూల్ సభలో కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ రాజ్యం అంటే దళారీ భోజ్యమని, వాళ్లకు మళ్లా అధికారం ఇస్తే మింగేస్తారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధరణిని బంగాళాఖాతంలో పడేస్తామన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పైరవీకారులే ధరణిని వద్దంటున్నారన్నది కేసీఆర్ అభిప్రాయంగా ఉంది. ధరణితో వారంలో రైతుబీమా అందుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు.
రైతుబంధు పైసలు, వడ్లమ్మిన పైసలు ధరణి వల్ల బ్యాంకుల్లో పడుతున్నాయని, రైతులు చనిపోతే బ్యాంకులోనే 5 లక్షల రూపాయలు పడుతున్నాయంటూ ప్రజలు కూడా సంతోషంగా చెబుతున్నారు. ధరణితో 99శాతం భూ సమస్యలకు పరిష్కారం దొరికిందంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు రాజ్యం అని, రైతులకు రైతుబంధు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతు బీమా కూడా క్రమం తప్పకుండా వస్తోందని, వ్యవసాయానికి 24గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని రైతులు బాహాటంగా మెచ్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications