సీఎం కేసీఆర్ పాన్ ఇండియా పార్టీ - ముహూర్తం ఇదే : కవితకు కీలక బాధ్యతలు..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. కొంత కాలంగా నుంచి ప్రణాళికా బద్దంగా తన జాతీయ పార్టీ ఏర్పాటు.. జాతీయ రాజకీయాల్లో ప్రవేశం వెను కారణాలను వివరిస్తూ వచ్చిన సీఎం కేసీఆర్, ఇప్పుడు వేగంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా పార్టీకి చెందిన 33 జిల్లాల అధ్యక్షులు తమ పార్టీ అధినేత జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ ఆహ్వానించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశాల సమయంలోనే టీఆర్ఎస్ శాసనసభా పక్షం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని కోరుతూ తీర్మానం చేయనుందని తెలుస్తోంది.

కేసీఆర్ ను కోరుతూ తీర్మానాలు
అసెంబ్లీలోని కేంద్ర తీరు పైన చర్చకు సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఆ చర్చ సమయంలో కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం పైన సభా వేదికగా సభ్యులు కోరే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీకి చెందిన జెండా..అజెండా..గుర్తు..ప్రాధాన్యతల పైన పూర్తి స్థాయిలో నిర్ణయాలు జరిగాయని చెబుతున్నారు. గులాబీ రంగులోనే పార్టీ జెండా ఉండటంతో పాటుగా ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న విధంగానే భారతీయ రాష్ట్ర సమితిగా పేరు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక, అజెండాలో భాగంగా వ్యవసాయం - యువత- విద్యుత్ - సాగునీటి రంగాల గురించి వివరించటంతో పాటుగా.. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశ వ్యాప్తంగా ఏ విధంగా అమలు చేయగలమనేది వివరించేందుకు సిద్దమయ్యారు. దీంతో పాటుగా..కలిసొచ్చే పార్టీలు..నేతలతోనూ చర్చలు చేస్తున్నారు.

ఇప్పటికే జెండా - అజెండా ఖరారు
అందులో భాగంగా రేపు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి హైదరాబాద్ రానున్నారు. ఇప్పటికే కర్ణాటక పర్యటనకు వెళ్లిన సమయంలో సీఎం కేసీఆర్ మాజీ ప్రధాని దేవ గౌడ - కుమార స్వామితో చర్చలు జరిపారు. ఇక, పార్టీ ప్రకటనకు సంబంధించి ముహూర్తం ఫిక్స్ అయినట్లు విశ్వసనీయ సమాచారం. విజయదశమి నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ పార్టీ ప్రకటనతో పాటుగా జెండా- అజెండాను వెల్లడిస్తారని తెలుస్తోంది. అందులో భాగంగా.. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల నుంచి మద్దతు తీర్మానాలను పంపేందుకు రంగం సిద్దమైంది. పార్టీ ప్రకటన చేసిన వెంటనే దాదాపుగా 40 రోజుల పాటుగా దేశ వ్యాప్తంగా పర్యటనకు కేసీఆర్ ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నట్లుగా సమాచారం. పంజాబ్ తో పాటుగా ఉత్తర ప్రదేశ్ లోనూ బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది.

జాతీయ పార్టీలో కవితకు కీలక బాధ్యతలు
కేసీఆర్ ఏర్పాటు చేసే జాతీయ పార్టీలో ఎమ్మెల్సీ కవితకు కీలక బాధ్యతలు ఉంటాయని చెబుతున్నారు. అదే విధంగా బోయినపల్లి వినోద్ కుమార్.. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి.. మాజీ స్పీకర్ మధుసూధనాచారి.. కరీంనగర్ మాజీ మేయర్ రవీంద్ర సింగ్ లకు ప్రధాన బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు సీఎం హోదాలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన పాత్ర కొనసాగిస్తారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలో మరోసారి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే లెక్కలపైన క్లారిటీ వచ్చిన తరువాతనే జాతీయ పార్టీ పైన కేసీఆర్ వేగంగా అడుగులు వేస్తున్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications