ఒక్కో సభకు 2కోట్లా.. బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సభల టెన్షన్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. అన్ని ప్రధాన రాజకీయ పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది. ఇప్పటికే రెండు దఫాలుగా అధికారాన్ని కొనసాగించిన బిఆర్ఎస్ పార్టీ మళ్లీ మూడోసారి విజయం సాధించి అధికారంలోకి రావడానికి సీఎం కేసీఆర్ పక్కా ప్లాన్ తో ముందుకు వెళుతున్నారు.
ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలోనూ వరుసగా పర్యటనలు చేస్తున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలలో పాల్గొంటూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సుడిగాలి పర్యటనలు చేస్తున్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించటమే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వరుసగా నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటున్న క్రమంలో పార్టీ అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

సీఎం కేసీఆర్ సభలకు జన సమీకరణ చేయడం అభ్యర్థులకు తలకు మించిన భారంగా మారుతుంది. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అక్కడ స్థానిక పార్టీ నేతలు జనసమీకరణ విషయంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికలలో ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందని వారు లబోదిబోమంటున్నారు. సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు ఒక్కొక్క సభకు కనీసం రెండు కోట్ల రూపాయలు మేర ఖర్చవుతుందని వారు వాపోతున్నారు.
తమ కోసం కేసీఆర్ పర్యటించి పెద్దఎత్తున ప్రచారం చేయడం ప్లస్ అని భావిస్తున్నప్పటికీ, సభలకు జన సమీకరణ, అవుతున్న ఖర్చు నేపథ్యంలో అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇక మరోవైపు సభా వేదికల వద్ద కూడా సర్వే సంస్థలు జనం నాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ ఆధిక్యం దక్కుతుందని ప్రచారం చేస్తున్న సంస్థలు కూడా లేకపోలేదు. ఇక ఈ ఎన్నికల్లో జయాపజయాలు మాట అటుంచి ప్రస్తుతం అవుతున్న ఖర్చు మాత్రం అభ్యర్థులకు మోత మోగిపోతుంది. గత ఎన్నికల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు అన్ని నియోజకవర్గాలలోనూ కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications