కోటి మంది మహిళలని కోటీశ్వరులను చేయడమే లక్ష్యం - సీఎం రేవంత్ రెడ్డి
ఇందిరా గాంధీ ప్రపంచానికి మహిళా శక్తి ఏంటో చూపించారని.. తెలంగాణలో ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే కోటి మంది మహిళలు కోటీశ్వరులవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పటికే మహిళల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు జూబ్లీహిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్లో నిర్వహించిన 'వీ హబ్ ఉమెన్ యాక్సిలరేషన్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహిళల ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి మరోసారి గుర్తు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన మహిళల స్టాళ్లను కూడా సందర్శించి, ఆ తరువాత తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని అందించామని చెప్పారు. గ్యాస్ సిలిండర్ను రూ. 500కే అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 'అమ్మ ఆదర్శ పాఠశాలల' నిర్వహణను మహిళలే చూసుకుంటున్నారని వివరించారు. ఈ నెల 21న జరిగే కార్యక్రమంలో 'మిస్ వరల్డ్' కంటెస్టెంట్లు మహిళా స్టాళ్లను సందర్శించనున్నారని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో మహిళల స్వయం సహాయక సంఘాలు ఎంతో విజయవంతంగా నడుస్తున్నాయని సీఎం వెల్లడించారు. సభ్యుల సంఖ్యను కోటి వరకు పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కార్పొరేట్ కంపెనీలకు అప్పు ఇచ్చినప్పుడు వారు అప్పు ఎగ్గొట్టి దేశం విడిచి వెళ్తున్నారని.. కానీ మన మహిళలు తీసుకున్న రూపాయిని వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తున్నారని వివరించారు. శిల్పారామంలో మహిళల ఉత్పత్తుల ప్రదర్శన కోసం ప్రత్యేక స్టాళ్లు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మీ రేవంతన్నగా, మీ కోసం ఎల్లప్పుడూ అండగా ఉంటానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలన్నదే ప్రభుత్వ ఆశయమని చెప్పారు.
వ్యాపారాల నిర్వహణ..
వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ వ్యాపారాన్ని ఇప్పటికే మహిళలకు అప్పగించామని రేవంత్ రెడ్డి చెప్పారు. సమర్థవంతంగా నిర్వహిస్తే మరికొన్ని అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి వచ్చే అతిథులకు గిఫ్ట్లుగా కూడా మహిళలు తయారుచేసిన ఉత్పత్తులను ఇవ్వడం జరుగుతుందని వివరించారు. విద్యార్థుల యూనిఫార్మ్ కుట్టు పనిని మహిళా సంఘాలకే అప్పగించామని, అలాగే పెట్రోల్ బంకులు, సోలార్ వ్యాపారాలు, ఇతర సంస్థల నిర్వహణకు మహిళల్ని ప్రోత్సహిస్తున్నామని అన్నారు.
LIVE: Hon'ble Chief Minister Sri. A. Revanth Reddy participates in Launch of WE Hub-Women Acceleration Programme at JRC Convention, Jubliee Hills, Hyderabad https://t.co/XAgKB7M8o7
— Telangana CMO (@TelanganaCMO) May 17, 2025












Click it and Unblock the Notifications