సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ముప్పు
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెను ముప్పు తృటిలో తప్పింది. ఆయన ప్రయాణిస్తోన్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని పసిగట్టిన పైలెట్లు సకాలంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అందులో ప్రయాణిస్తోన్న వారికి ఎలాంటి ప్రమాదం తలెత్తకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ ఇదే విమానంలో ఉన్నారు. పైలెట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం సంభవించకుండా వారందరూ సురక్షితంగా బయటపడగలిగారు.

రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ సాయంత్రం ముంబైకి వెళ్లాల్సి ఉంది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. దీనికోసం ఈ మధ్యాహ్నం 2:30 గంటకు వారు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
అక్కడి నుంచి ఇండిగో విమానంలో ముంబైకి బయలుదేరారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం మళ్లీ వెనక్కి వచ్చింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. టేకాఫ్ అయిన కొద్దీసేపటికే విమాంలో సాంకేతిక లోపం తలెత్తినట్టు పైలెట్లు గుర్తించడంతో.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినట్లు తెలిసింది.
సాంకేతిక లోపాన్ని సవరించిన తరువాత మళ్లీ ఈ విమానం ముంబైకి బయలుదేరింది. ఫలితంగా గంటన్నర పాటు ఫ్లైట్ ఎయిర్ పోర్ట్లోనే నిలిపివేయాల్సి వచ్చింది. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ నేతలందరూ విమానాశ్రయంలోనే గడిపారు. లోపం సరి చేసిన తరువాత అదే విమానంలో మళ్లీ ముంబైకి బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications