కాంగ్రెస్ ఎంపీ అభ్యర్దుల జాబితా ఖరారు - రేపే ప్రకటన, లిస్టులో..!!
తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలపైన కాంగ్రెస్ గురి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం కొనసాగించాలని భావిస్తోంది. అందులో భాగంగా ఎంపీ అభ్యర్దుల ఎంపిక పైన ఫోకస్ చేసింది. సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. ఇప్పటికే ఎంపీ ప్రతిపాదిత అభ్యర్దుల జాబితా పార్టీ నాయకత్వానికి అందించారు. పార్టీ తొలి జాబితాలోనే తెలంగాణ అభ్యర్దులను ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా 12 మంది పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది.
ఢిల్లీకి సీఎం రేవంత్: ముఖ్యమంత్రి రేవంత్ కు కాంగ్రెస్ నాయకత్వం బిగ్ టాస్క్ అప్పగించింది. తెలంగాణలోని 17 ఎంపీ స్థానల్లో మెజార్టీ స్థానాలను గెలవాలని నిర్దేశించింది. సీఎంగా...పీసీసీ చీఫ్ గా రేవంత్ కు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. బీజేపీ ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసే 9 మంది అభ్యర్దుల పేర్లను తొలి జాబితాలోనే ప్రకటించింది.

కాంగ్రెస్ తమ తొలి విడత జాబితాలోనే తెలంగాణలోని ఎంపీ స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. రేపు (గురువారం) ఢిల్లీలో సమావేశం అనంతరం లోక్సభ అభ్యర్థులపై క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ ఆమోదంతో రేపు సాయంత్రం లేదా ఎల్లుండి కాంగ్రెస లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నాయి.
తొలి జాబితా సిద్దం: తెలంగాణలోని 17 స్థానాల్లో భాగంగా 16 స్థానాలకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను కాంగ్రెస్ స్క్రినింగ్ కమిటీ పరిశీలించింది. అందులో 12 మంది వరకు అభ్యర్దులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తొలి విడతలో 8 లేదా 9 మంది అభ్యర్దులను ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే కోస్గి సభలో సీఎం రేవంత్ మహబూబ్ నగర్ అభ్యర్దిగా వంశీచందర్ రెడ్డి పేరు ప్రకటించారు.
కరీంనగర్- ప్రవీణ్ కుమార్ రెడ్డి, పెద్దపల్లి - గడ్డం వంశీ, నిజామాబాద్ - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జహీరాబాద్ - సురేశ్ షెట్కార్, చేవెళ్ల - సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ - బొంతు రామ్మోహన్ లేదా ఆయన సతీమణి పేర్లు పరిశీలనతో ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ - జానారెడ్డి లేదా రఘువీర్ రెడ్డి లో ఒకరికి ఛాన్స్ దక్కనుంది.
ఆ రెండు సీట్లకు పోటీ: ఇక పార్టీలో మల్కాజ్ గిరి సీటును ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది. అక్కడ హీరో అల్లు అర్జున్ మామ శేఖర్ రెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే విధంగా ఖమ్మం సీటు నుంచి అభ్యర్ది ఎంపిక సమస్యగా మారుతోంది. డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు ఎంపీ టికెట్ రేసులో ఉన్నారు.
ఇదే సమయంలో ఖమ్మం నుంచి పోటీ చేయాలని పార్టీ అగ్రనేత రాహుల్ ను టీపీసీసీ కోరింది. ఆయన తన నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. దీంతో..ఇప్పుడు రేవంత్ ఢిల్లీ పర్యటన సమయంలో ఖరారయ్యే కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా పైన పార్టీలో ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications