సీఎం గర్జనలు గల్లీకే కానీ ఢిల్లీకి కాదా.?అమిత్ షాను చూడగానే యూటర్న్.!కేసీఆర్ పై సీఎల్పీ నేత ఫైర్.!
హైదరాబాద్ : ఇటీవల ఢిల్లీలో జరిగిన రైతాంగ ఉద్యమంలో అమరులైన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రవేఖర్ రావు చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్టు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఢిల్లీలో అమరులైన రైతులకు ఇచ్చినట్లే తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేయాలని భట్టి విక్రమార్క డిమండ్ చేసారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడి ఏడున్నర ఏళ్ళు అవుతున్నా ఆ కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు న్యాయం చేయలేదని భట్టి ఆవేదన వ్యక్తం చేసారు.
ఢిల్లీతో యుద్దం చేయడానికి వెళ్లిన కేసీఆర్.. తిరిగొచ్చే టైంకి రోడ్లపై ఉన్న వడ్లు మొలకెత్తుతాయన్న భట్టి
12వందల మంది అమరులకు న్యాయం చేస్తామంటే 2014వ సంవత్సరంలో జూన్ 14 వ తారీఖు నాడు అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి ఏకగ్రీవ తీర్మానం చేసాయని భట్టి విక్రమార్క గుర్తు చేసారు. 1969 సంవత్సరంలో తొలి విడత తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన 369 అమర వీరులతో సహా 2014 దశకంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో అమరులైన పన్నెండు వందల మంది కుటుంబాలకు ఉద్యోగం, 10లక్షలు, డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని వాగ్దానం చేసి సీఎం చంద్రశేఖర్ రావు పూర్తిగా మర్చిపోయారని భట్టి గుర్తు చేసారు.
అమీత్ షాను చూడగానే మెత్తపడుతున్న కేసీఆర్.. ఈ సారి తాడోపేడో తేల్చకుని రావాలన్న సీఎల్పీ నేత
రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలా? వద్దా? ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే సమాదానం చెప్పాలన్నారు భట్టి విక్రమార్క. చంద్రశేఖర్ రావు కేంద్రం పై యుద్ధానికి వెళ్లినందుకు సంతోషంగా ఉందని, అదే సమయంలో రాష్ట్ర రైతంగ సమస్యలు కూడా పట్టించుకోవాలి కదా అన్నారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తామని రోడ్లపై నిరసన తెలిపి, అమిత్ షాను కలువగానే యూ టర్న్ తీసుకుంటున్నారని ముఖ్యమంత్రి వైఖరిపై భట్టి మండిపడ్డారు.
తెలంగాణ రైతుల కష్టాలు వర్ణణాతీతం.. పట్టించుకునే నాథుడు లేడన్న భట్టి..
ఇప్పుడు ఢిల్లీ పై యుద్ధమే అని మళ్ళీ అమిత్ షా ను కలుస్తా అంటున్నారని, మరి ఇప్పుడు కూడా యూ టర్న్ తీసుకుంటారా? నిజంగా ముఖ్యమంత్రి యుద్ధం చేస్తారా అని ప్రశ్నించారు. కేంద్ర పెద్దలను నిలదీస్తానని చంద్రశేఖర్ రావు ఢిల్లీలో మకాం వేసారని, మరి రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలను ఎవరు పరిష్కరించాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేరు, చేతికి అందొచ్చిన పంటంతా రోడ్లపై వానలో తడుస్తుంది. రైతాంగాన్ని ఆదుకునే బాద్యత ఎవరిదని ప్రశ్నించారు.
ఈసారైనా కేసీఆర్ చర్చలు జరపాలి.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ప్రతిబింబించాలన్న విక్రమార్క
ఈసారైనా చంద్రశేఖర్ రావు మాటమిద నిలబడాలని, అమిత్ షా ను కలువగానే యూ టర్న్ తీసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం చేయాల్సిన పని చేయకుండా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఢిల్లీలో మకాం వేస్తే తెలంగాణ సమాజం క్షమించదని హెచ్చరించారు. ఏడున్నర ఏళ్ల నుంచి నీటి వాటా తేల్చలేదని సీఎం చెప్తున్నారని, మరి ఏడేళ్లుగా చంద్రశేఖర్ రావు ఏంచేస్తున్నారని నిలదీసారు. ప్రాజెక్టులపై కాగ్రెస్ పార్టీ వివరాలు అడిగితే ఎన్ని అసెంబ్లీ సమావేశాలు పోయినా డీపీఆర్ లు మాత్రం ఇవ్వరని మండిపడ్డారు. అంతే కాకుండా ఢిల్లీతో తాడోపేడో తేల్చుకొని యుద్దం ముగించుకుని చంద్రశేఖర్ రావు తెలంగాణకు వచ్చేసరికి కల్లాల్లోని వడ్లన్నీ మొలకెత్తేలా ఉన్నాయని భట్టి విక్రమార్క ఎద్దేవా చేసారు.