టీ పీసీసీ చీఫ్ కోసం కసరత్తు, నేతలతో మానిక్కాం ఠాగూర్ మంతనాలు.. కోర్ కమిటీ భేటీ
కాంగ్రెస్ పార్టీలో పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ కాక రేపుతోంది. రోజుకో పేరు వినిపిస్తోండగా.. హైకమాండ్ కూడా నేతల నుంచి అభిప్రాయం సేకరిస్తున్నారు. రాష్ట్రంలో మకాం వేసిన మానిక్కం ఠాగూర్.. ఇవాళ గాంధీభవన్లో నేతలతో భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ ఎంపిక కోసమే కోర్ కమిటీ సమావేశమైంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, వీహెచ్, మధుయాష్కి, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు.
పీసీసీ చీఫ్ పదవీ ఎవరికీ ఇవ్వాలనే అంశంపై నేతల నుంచి అభిప్రాయం తీసుకున్నారు. ఎవరు అయితే బాగుంటుంది అని చర్చించారు. అందరినీ కలుపుకొని పోయి.. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేవారికి ప్రాధాన్యం ఇస్తామని ఠాగూర్ స్పష్టంచేశారు. ఇద్దరు ముగ్గురు నేతల పేర్లను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశానని ఉత్తమ్కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి మానిక్కాం ఠాగూర్ అభిప్రాయ సేకరణ చేసి సోనియాగాంధీకి నివేదిక ఇస్తారని ఆయన చెప్పారు.
గ్రేటర్లో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత తీసుకున్న ఉత్తమ్కుమార్కు మానిక్కం ఠాగూర్ ధన్యవాదాలు తెలిపారు. ఇతర నాయకులకు ఉత్తమ్ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. కొత్త అధ్యక్షుడి నియామకం కోసం ప్రక్రియ ప్రారంభం అయ్యిందని చెప్పారు. దీనికి సంబంధించి ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పోషించే రోల్ను హైకమాండ్ నిర్ణయిస్తుందని ఠాగూర్ పేర్కొన్నారు.