తెలంగాణలో ‘ఆపరేషన్ ఏఐసీసీ’! రాహుల్ కనుసన్నల్లో రహస్య భేటీలు?
తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంపై ఆ పార్టీ అధిష్ఠానం దృష్టి సారించిందా? ఏఐసీసీ ‘సీక్రెట్ ఆపరేషన్’ ప్రారంభించిందా? టీఆర్ఎస్కు వ్యతిరేక శక్తులను ఏకతాటిపైకి తేవడమే కాంగ్రెస్ అధిష్ఠానం లక్ష్యమా?
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంపై ఆ పార్టీ అధిష్ఠానం దృష్టి సారించిందా? ఆలిండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) 'సీక్రెట్ ఆపరేషన్' ప్రారంభించిందా? టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులనూ ఏకతాటిపైకి తేవడమే కాంగ్రెస్ అధిష్ఠానం లక్ష్యమా?
చాపకింద నీరులా: గద్దర్, కోదండరాంతో కాంగ్రెస్ కీలక నేతల రహస్య భేటీ!
తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో సంబంధం లేకుండా నేరుగా ఏఐసీసీ రంగంలోకి దిగిందా? రాహుల్ గాంధీ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో వివిధ వర్గాల నాయకులను కలుస్తున్నదెవరు? 'ఆపరేషన్ ఏఐసీసీ'లో గద్దర్, కోదండరామ్ కూడా ఉన్నారా?
తెలంగాణలో ఆపరేషన్ ఏఐసీసీ...
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తన పట్టు పెంచుకునే ప్రయత్నాలు మొదలెట్టింది. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సూచనల మేరకు ఏఐసీసీకి చెందిన ఓ బృందం ఇదే పనిపై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సీక్రెట్ ఆపరేషన్పై టీ కాంగ్రెస్ నాయకులకు సైతం సమాచారం లేకపోవడం గమనార్హం. స్థానిక నాయకులను విస్మరించి నేరుగా ఆయా వ్యక్తులు, నాయకులను ఈ బృందం రహస్యంగా కలుస్తున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను కూడగట్టి...
తెలంగాణలో నేరుగా రాహుల్ టీం రంగంలోకి దిగింది. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉన్న అన్ని వర్గాలను, శక్తులను కూడగట్టడమే లక్ష్యంగా ఏఐసీసీ తన ఆపరేషన్ ను ప్రారంభించింది. ఈ బాధ్యతను తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి కుంతియా, ఏఐసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ కొప్పుల రాజు పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా వీరు పలువురు నాయకులను కలుస్తూ వారి మద్దతు కూడగట్టడానికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ గాంధీ కనుసన్నల్లో...
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కనుసన్నల్లో ఈ ‘ఆపరేషన్ ఏఐసీసీ' సాగుతున్నట్లు తెలుస్తోంది. కుంతియా, కొప్పుల రాజులు రహస్యంగా తెలంగాణలో ఎవరెవర్ని కలవాలో కలుస్తున్నారు. ఆయా వ్యక్తులను కలిసి వారికి రాహుల్ గాంధీ సందేశాన్ని వారు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల క్రితం ప్రజాగాయకుడు గద్దర్, టీజేఏసీ ఛైర్మన్ కోదండరాంతో వీరిరువురు రహస్యంగా సమావేశం అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
మీకు మేము, మాకు మీరు...
తెలంగాణలో కొంతమంది నాయకులను కలుస్తున్న కుంతియా, కొప్పుల రాజు వారికి తమ యువరాజు సందేశాన్ని వినిపిస్తున్నారు. ‘‘తెలంగాణలో పాలన మీ ఆకాంక్షల మేరకు సాగడం లేదు కదా? ప్రత్యేక తెలంగాణ ఇచ్చి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని మేమూ భావించాం కానీ మేం కూడా ఇలాంటి పరిస్థితిని ఊహించలేదు. మీరు ప్రభుత్వ విధానాలపై పోరాడుతున్నారు. మీ పోరాటాల ప్రభావం ప్రజలపై తప్పకు ఉంటుంది. కానీ మీరు ఏ రాజకీయ పార్టీలో లేరు కాబట్టి ఓట్లు చీలితే మళ్లీ టీఆర్ఎస్ లాభపడుతుంది.. మీ పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా నిలుస్తుంది, మీరు కూడా మాకు మద్దతు ఇవ్వండి.. ఇది రాహుల్ మాట.. '' అంటూ వీరు ఆయా నాయకుల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.