ఢిల్లీ కేంద్రంగా మద్దతు కూడగడుతున్న రేవంత్
Revanth Reddy: దేశ రాజకీయాల్లో తీవ్ర వివాదానికి కారణమైన వక్ఫ్ సవరణ బిల్లు లోక్సభ సమక్షానికి వచ్చింది. కేంద్ర న్యాయ, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు- దీన్ని సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చను మొదలుపెట్టారు. కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడారు.
అదే సమయంలో- బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తెలంగాణ కాంగ్రెస్, బీసీ సంఘాల నాయకులు రోడ్డెక్కారు. పోరు బాట పట్టారు. బీసీ పోరు గర్జన పేరుతో ఢిల్లీ వేదికగా జాతీయ స్థాయి ఆందోళనకు దిగారు. నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తోన్నారు. మహా ధర్నాను చేపట్టారు.

బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలనేది తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన డిమాండ్. దీనిపై ఇదివరకే రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది కూడా. దీన్ని కేంద్రానికి పంపించింది. ఈ రెండింటినీ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆమోదించాలంటూ కాంగ్రెస్, బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుత లోక్సభ బడ్జెట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలంటూ తెలంగాణ కాంగ్రెస్, బీసీ సంఘాల నాయకులు కొంతకాలంగా డిమాండ్ చేస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ బీసీ పోరు గర్జన బాట పట్టారు. ఢిల్లీ జంతర్మంతర్ వద్ద బైఠాయించారు.
కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీసీ సంఘాల ధర్నాకు హాజరయ్యారు. తన సంఘీభావాన్ని తెలియజేశారు. ఆయనతో పాటు తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా వెంటనే కులగణన చేపట్టాలంటూ బీసీ నాయకులు డిమాండ్ చేశారు. చట్టసభల్లో బీసీ మహిళలకు 33 శాతం సబ్ కోటా ఇవ్వాలంటూ నినదించారు. దీనికి సంబంధించిన ప్లకార్డులను ప్రదర్శించారు. దీనికి- ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా బ్లాక్ నుంచి మద్దతు లభిస్తోంది.
అఖిల భారత మజ్లిస్-ఇత్తెహాదుల్- ముస్లిమీన్ అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, రాష్ట్రీయ జనతాదళ్ ఎంపీ మనోజ్ ఝా, డీఎంకే ఎంపీ కనిమొళి ఈ బీసీ గర్జనకు తమ సంఘీభావం తెలిపారు.












Click it and Unblock the Notifications