టీడీపీ ఆరిపోయిన దీపం: నారాయణఖేడ్ సభలో మంత్రి హరీశ్
హైదరాబాద్: ఉప ఎన్నిక సమరానికి నారాయణఖేడ్ సన్నద్ధమైంది. తెలంగాణలోని అన్ని పార్టీలు ఈ ఉపఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సోమవారం నారాయణఖేడ్ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ అభ్యర్ధి భూపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా నారాయణఖేడ్ ఫంక్షన్ హాల్ దగ్గర టీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ వరంగల్ మాదిరిగానే నారాయణఖేడ్లోనూ విపక్షాల డిపాజిట్లు గల్లంతు కావాలని పిలుపునిచ్చారు.
నారాయణఖేడ్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిని గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్కు ఓటేయాలంటే వంద కారణాలు ఉన్నాయని చెప్పారు. అంతేకాదు కాంగ్రెస్, టీడీపీ ఓట్లు అడగడానికి ఎం అర్హత ఉందో చెప్పాలని ప్రశ్నించారు.
60ఏళ్లు నారాయణఖేడ్ను పాలించిన కాంగ్రెస్, టీడీపీ ఏం అభివృద్ధి చేశాయో చెప్పాలన్నారు. నియోజకవర్గంలో ఒక్క మార్కెట్ అయినా కట్టారా? అంటూ నిలదీశారు. ఆరు దశాబ్ధాలు కాంగ్రెస్, టీడీపీలకు అధికారం ఇస్తే కనీసం మంచినీటి సమస్యను పరిష్కరించలేదని మండిపడ్డారు.

అదే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక జూనియర్ కాలేజీ మంజూరు చేశామన్నారు. నారాయణఖేడ్లో ఇప్పటి దాకా వంద పడకల ఆసుపత్రి లేదన్నారు. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో 60 ఏళ్లలో 20 సబ్స్టేషన్లు ఏర్పాటు చేస్తే తెలంగాణ ప్రభుత్వం 60 రోజుల్లో 11 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసిందన్నారు.
నియోజకవర్గంలో ఆర్అండ్బీ నిధుల కింద సీఎం కేసీఆర్ 172 కోట్లు మంజూరు చేశారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 14 కోట్లతో మార్కెట్ యార్డ్ ఏర్పాటు చేశామని చెప్పిన మంత్రి హరీశ్ రావు అరవై ఏళ్ల కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూసి 18 నెలల్లో టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు.
నియోజకవర్గానికి 150 పడకల ఆసుపత్రిని మంజూరు చేశామన్నారు. కంటిముందు అభ్యర్థి, ఇంటిముందు అభివృద్ధి చూసి ఓటేయ్యాలన్నారు. తెలంగాణ కోసం దెబ్బలు తిని జైలుకు పోయిన ఉద్యమకారుడు భూపాల్రెడ్డి అని అన్నారు. నియోజకవర్గాన్ని రాయలసీమగా మార్చారని విచారం వ్యక్తం చేశారు.
రూ.200 ఉన్న పెన్షన్ను రూ. వెయ్యికి పెంచామన్నారు. కుల, మతాలకు అతీతంగా పేదింటి ఆడబిడ్డలందరికీ కళ్యాణలక్ష్మీ పథకం అమలు చేస్తున్నామన్నారు. ఇక తెలంగాణలో టీడీపీ ఆరిపోయిన దీపమని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications