న్యాయవాది రెహనాకు సారిక ఈ మెయిల్: విషయం ఇదీ...
వరంగల్: ఆనుమానాస్పద స్థితిలో మరణించిన మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక తన తరపు న్యాయవాదికి 22 పేజీల ఈ మెయిల్ పంపించారు. తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారంటూ ఆమె ఈ మెయిల్లో ఆరోపించింది. భర్త అనిల్ వ్యవహారాన్ని చాలా వివరంగా ఆమె చెప్పింది. ఈ మెయిల్లోని ముఖ్యాంశాలు ఈ విధంగా ఉన్నాయి.
"ఇల్లు విడిచి వెళ్లాలంటూ పదే పదే భర్త వేధించేవారు. తిట్లు, అరుపులు, కేకలతో రోజూ అత్త విరుచుకుపడేది. నా తల్లి ఇచ్చిన చీరను కూడా తీసుకోనివ్వలేదు. రాజయ్య ఎంపి అయిన తర్వాత వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఇంట్లో పనివాళ్లు, పరిచయస్తుల ముందే తిట్టేవారు. అనిల్కు వివాహేతర సంబంధాలున్నాయి. ఎప్పుడు ఇంటికి వస్తాడో, ఎప్పుడు వెళ్లిపోతాడో తెలియదు.
Photos: రాజయ్య కోడలు మృతి
కుటుంబం పట్ల కనీస బాధ్యత లేదు. ఎక్కడకు వెళ్లావని అడిగితే చాలు.. భౌతిక దాడులకు దిగేవాడు. ఇంత జరుగుతున్నా... అత్తామామలు పట్టించుకునేవాళ్లు కాదు. వండుకోవడానికి కనీసం సరుకులు కూడా ఇచ్చేవాళ్లు కారు. నేను, పిల్లలు చాలాసార్లు ఆకలితో అలమటించాం. పిల్లల స్కూల్ ఫీజులు , ఆస్పత్రి బిల్లులు కట్టేవాడు కాదు.
నా తల్లిదండ్రులు, అక్కాచెల్లెళ్లతో మాట్లాడేందుకు అనిల్ అంగీకరించేవాడు కాదు. నన్ను ఎప్పుడూ ఇంట్లో నుంచి పంపిద్దామా.. అన్నదే అత్త, మామల ఆలోచన. పిల్లలు నేను హాల్లోనే ఉండేవాళ్లం. నిరంతరం వేధింపులకు గురి చేసేవారు. ఏమైనా అడిగితే ఇంటి నుంచి వెళ్లిపో అనేవారు.
జీవితాన్ని త్యాగం చేయాలంటూ రాజయ్య కూడా అనేవారు. చాలా మంది మహిళలు.. భర్తలు, అత్తమామల కోసం జీవితాలు త్యాగం చేశారని రాజయ్య చెప్పేవారు. రాజయ్య మాటలకు చాలాసార్లు బాధపడ్డా. జీవితాన్ని ముగించాలన్న ఆలోచన అనేకసార్లు వచ్చేది. ఈ షాక్, ఒత్తిళ్ల ముంచి బయటపడడానికి చాలా సమయం పట్టేది".