తెలంగాణలో పోలీసు సిన్ రిపీట్: కూలీలకు సంకెళ్లు వేసి....
ఉగ్రవాదులను, సంఘవిద్రోహ శక్తులను తీసుకెళ్లినట్టు కూలీలను పోలీసులు బేడీలు వేసి కోర్టుకు తరలించారు. ఏడుగురు కూలీలకు బేడీలు వేసి తరలించారు. అందులో ఐదుగురు దళితులు.
కరీంనగర్: ఉగ్రవాదులను, సంఘవిద్రోహ శక్తులను తీసుకెళ్లినట్టు కూలీలను పోలీసులు బేడీలు వేసి కోర్టుకు తరలించారు. ఖమ్మంలో మిర్చి పంటకు మద్దతు ధర కోసం ఆందోళనకు దిగిన అన్నదాతలకు బేడీలు వేసిన పోలీసులు ఇప్పుడు గూడు కోసం పోరాటం చేసిన కరీంనగర్ కూలీలకు సంకెళ్లు బిగించారు.
ఈ రెండు ఘటనల్లోనూ సుప్రీం కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడుగురు కూలీలకు బేడీలు వేసి తరలించారు. అందులో ఐదుగురు దళితులు. ఈ ఘటన కరీంనగర్ జైలు వద్ద శుక్రవారం జరిగింది.
ఇళ్ల స్థలాల కోసం..
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కిసాన్నగర్లో 2007లో ఇళ్ల స్థలాల కోసం కూలీలు పోరాటం చేశారు. స్థలాలు కేటాయించాల్సిన అప్పటి ప్రభుత్వం వారిపై కేసులు నమోదు చేయించింది. అప్పుడు 33 మందిపై కేసులు నమోదయ్యాయి.
కొందరు చనిపోయారు...
నిందితుల్లో మరణించారు. మరికొందరు కరీంనగర్లో పనిలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో భూపోరాట కేసులో కోర్టుకు హాజరుకాలేదు. ఇక నుంచి కోర్టుకు హాజరవుతామని 11 మంది ఈ నెల 17న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రిన్సిపల్ సివిల్ రైట్స్ కోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి జిల్లా జైలుకు రిమాండ్కు పంపారు.
కోర్టులో పేషి ఉండటంతో
కోర్టులో పేషి ఉండటంతో గందె కొమురయ్య, పండు రమేశ్, దొంతి శంకర్, మారుపాక దేవరాజ్, బొమ్మదేని ఆగయ్య అనే దళితులకు సంఘవిద్రోహ శక్తులకు వేసినట్టు బేడీలు వేసి తరలించారు. 11 మంది నిందితుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. కూలీలకు బేడీలు వేసిన ఘటనపై విమర్శలు వినిపిస్తున్నాయి.
గతంలో ఖమ్మంలో....
గతంలో ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి కోర్టుకు తరలించిన సంఘటనపై తీవ్ర నిరసన పెల్లుబుకిన విషయం తెలిసిందే. ఖమ్మం మార్కెట్ యార్డుపై దాడి సంఘటనలో కొంత మంది రైతులపై పోలీసులు కేసులు పెట్టి వారిని అరెస్టు చేశారు. చేతులకు బేడీలు వేసి వారిని కోర్టుకు తరలించారు.