‘కాప్ కనెక్ట్’ 63వేల మంది పోలీసులకు ఒకేసారి సమాచారం: డీజీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలోని 63వేల మంది పోలీసులకు ఒకేసారి సమాచారం చేరవేసేలా 'కాప్ కనెక్ట్' యాప్ను రూపొందించామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీస్ శాఖ సాంకేతిక విభాగంలో ఇది ఒక విప్లవం లాంటిదని అన్నారు.
నూతనంగా రూపొందించిన ఈ 'కాప్ కనెక్ట్' యాప్ను సోమవారం డీజీపీ మహేందర్ రెడ్డి తన కార్యాలయంలో ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రారంభించారు. జిల్లాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఉన్నప్పటికీ.. ఒక్కో గ్రూపులో 256 మందిని మించి సభ్యులుగా గ్రూపులో చేర్చలేకపోతున్నామని తెలిపారు.
ఈ సమస్యను అధిగమించడానికే పోలీస్ శాఖ అంతర్గతంగా 'కాప్ కనెక్ట్' యాప్ను ఉపయోగించుకుంటుందని మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 31 జిల్లాల్లోని పోలీస్ ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు అందరినీ ఒకే గ్రూపుగా ఏర్పాటు చేసే అవకాశం ఈ అప్లికేషన్లో ఉండటం వల్ల సమాచారం చేరవేత సులభమవుతుందని డీజీపీ తెలిపారు.
ఉన్నతాధికారుల ఆలోచనలు, అభిప్రాయాలను కిందిస్థాయి సిబ్బంది వరకు క్షణాల్లో చేర్చడంవల్ల క్షేత్రస్థాయిలో మంచి ఫలితాలు వస్తాయని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.