నిర్మాత సురేష్ బాబుకు కరోనా వ్యాక్సిన్ పేరుతో టోకరా: పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబును కరోనా వ్యాక్సిన్ పేరుతో ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. 500 డోసుల టీకాలు ఉన్నాయని సురేష్ బాబుకు నాగార్జున రెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తన భార్య బ్యాంక్ ఖాతాకు రూ. లక్ష బదిలీ చేయాలని కోరాడు.
నాగార్జున రెడ్డి మాటలు నమ్మిన సురేష్ బాబు.. రూ. లక్ష బదిలీ చేశారు. అయితే, నగదు డ్రా చేసుకున్న తర్వాత నిందితుడు ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఈ క్రమంలో మోసపోయినట్లు గ్రహించిన సురేష్ బాబు.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సురేష్ బాబు తరపున ఆయన సహాయకుడు ఈ ఫిర్యాదు చేశారు.
కాగా, నాగార్జున రెడ్డిని నాలుగు రోజుల క్రితమే సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రతినిధిని టీకాల పేరుతో మోసగించిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ పీఏ అని పేర్కొంటూ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రతినిధిని మోసగించాడు. ప్రస్తుతం సంగారెడ్డి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు నాగార్జున రెడ్డి.
కరోనా మహమ్మారి నేపథ్యంలో బ్లాక్ దందాగాళ్లు, మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇలా వ్యాక్సిన్ విషయంలో పలు మోసాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. కరోనా చికిత్సలో ఉపయోగించి మందులను కూడా కొందరు బ్లాక్ మార్కెట్లలో భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే పోలీసులు సూచించిన విషయం తెలిసిందే.