కరోనా ఎఫెక్ట్... టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలకు బ్రేక్... వాయిదా వేసిన పార్టీ అధిష్ఠానం...
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను వాయిదా వేసుకుంది. ఈ నెల 27న పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించినప్పటికీ... కరోనా కారణంగా అనుకోని బ్రేక్ పడింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేడుకలను వాయిదా వేయడమే సరైనదని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. త్వరలోనే వరంగల్,ఖమ్మం కార్పోరేషన్లతో పాటు పలు మున్సిపాలిటీలకు ఎన్నికలు కూడా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే రెండు కార్పోరేషన్లు,ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం(ఏప్రిల్ 16) నుంచే మొదలుకానుంది.ఈ నెల 22 వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. మే 3న ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.
కాగా,నాగార్జునసాగర్లో ప్రచార పర్వం గురువారంతో ముగిసింది. శనివారం(ఏప్రిల్ 17) అక్కడ పోలింగ్ జరగనుంది. మే 2న ఫలితాలు వెల్లడి కానున్నాయి. సాగర్ ఉపఎన్నిక ప్రక్రియ దాదాపుగా ముగియడంతో ఇక టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై ఫోకస్ చేసింది. గతంలో జరిగిన మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం సాధించిన టీఆర్ఎస్... తాజా ఎన్నికల్లోనూ తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకు అవసరమైన వ్యూహాలను ఇప్పటికే సిద్దం చేసింది.
ఇదిలా ఉంటే,కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పదో తరగతి,ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పరీక్షలు లేకుండానే వారిని పై తరగతులకు ప్రమోట్ చేసింది. కరోనా కారణంగా ఇప్పటికే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు కూడా రద్దయ్యాయి. రాష్ట్రంలో గత కొద్దిరోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గురువారం(ఏప్రిల్ 15) 3307,శుక్రవారం(ఏప్రిల్ 16) 3840 కేసులు నమోదయ్యాయి.
మరో తొమ్మిది మంది కరోనాతో మృతి చెందారు. గతంలో రోజుకు రెండు లేదా మూడు మరణాలు మాత్రమే నమోదయ్యాయి. కానీ గత కొద్దిరోజులుగా వరుసగా ఎనిమిది లేదా తొమ్మిది మంది రాష్ట్రంలో కరోనాతో ప్రాణాలు విడుస్తున్నారు.తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 341,885కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1188కి చేరింది. ప్రస్తుతం 30,494 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను వాయిదా వేసుకుంది.