coronavirus: తెలంగాణలో తొలి కరోనా మరణం, ఆస్పత్రిలో వృద్దుడి మృతి, ఇటీవలే ఢిల్లీ..
తెలంగాణలో తొలి కరోనా మరణం నమోదైంది. నాంపల్లికి చెందిన 74 ఏళ్ల వృద్దుడు శనివారం చనిపోయాడు. అతని భార్య, కుమారుడు హోం క్వారంటైన్లో ఉన్నారు. వృద్దుడు ఈ నెల 14వ తేదీన మతపరమైన కార్యక్రమం కోసం ఢిల్లీ వెళ్లి.. 17వ తేదీన తిరిగొచ్చాడని అధికారులు తెలిపారు. 20వ తేదీన తీవ్ర జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది ఎదుర్కొన్నాడు. ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స అందజేశామని.. అతను చనిపోయాక కరోనా వైరస్ పాజిటివ్ సోకిందని తేలిందని అధికారులు తెలిపారు. మృతుడి కుటుంబసభ్యులను హోం క్వారంటైన్లో ఉంచామని చెప్పారు.

వృద్దుడి మృతి
ఢిల్లీకి వెళ్లి వచ్చిన వృద్దుడికి గ్లోబల్ ఆస్పత్రిలో చనిపోయారు. రక్త నమూనాలు పరీక్షిస్తే కరోనా కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నాంపల్లిలో వృద్దుడు చనిపోగా అతని భార్య, కుమారుడు క్వారంటైన్లో ఉంచామని తెలిపారు. మరోవైపు కుత్బుల్లాపూర్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి కూడా వైరస్ సోకిందని వివరించారు. శనివారం కొత్తగా ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, దీంతో కేసుల సంఖ్య 65కి చేరిందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

10 మంది ఓకే..
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 65 మందిలో 10 మందికి నెగిటివ్ వచ్చిందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.10 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారని.. వారిని రెండు రోజులు పర్యవేక్షించిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామన్నారు. శుక్రవారం, శనివారం మాత్రమే పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని వివరించారు. క్వారంటైన్లో ఉన్నవారి సంఖ్య తగ్గుతోందని.. ఆ వ్యక్తులు బయట తిరిగితే జైలుకు పంపిస్తామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.

నో రెడ్ జోన్..
కరోనా వైరస్ గురించి మీడియా తప్పుడు సమాచారం ఇవ్వొద్దని ఈటల రాజేందర్ సూచించారు. హైదరాబాద్లో పరిస్థితి అదుపులో ఉందని.. ఎలాంటి రెడ్ జోన్లు జారీచేయలేదని పేర్కొన్నారు. వైరస్ గురించి సమాచారం ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని ఆయన తెలిపారు. తప్పుడు కథనాలతో ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారే కుటుంబసభ్యులకు వైరస్ అంటించారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications