ప్లాస్టర్ వేసి.. అరగంటలోనే అభయ్ హత్య: గదికి తీసుకెళ్లి కిడ్నాప్పై చెప్పాడు
హైదరాబాద్: భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థి అభయ్ కేసును పోలీసులు ఛేదించారు. కేసుకు సంబంధించిన సీపీ మహేందర్ రెడ్డి షాకింగ్ విషయాలను మీడియాకు వెల్లడించారు. నోటికి, ముక్కుకు ప్లాస్టర్ వేయడంతో అభయ్ చనిపోయాడని, కిడ్నాప్ చేసిన అరగంటకే చంపేశారని సీపీ చెప్పారు.
అభయ్ కేసులో ముగ్గుర్ని రాజమహేంద్రవరంలో అరెస్టు చేశామని చెప్పారు. అభయ్ను నిందితుడు చిన్నసాయి మాయమాటలతో నమ్మించాడని చెప్పారు. వాట్సాప్తో పాటు అప్పుడప్పుడు అభయ్ని నిందితుడు కలిసేవాడని చెప్పారు.
కిడ్నాప్ జరిగిన రోజు.. అభయ్ను ఓ హోటల్ వద్ద నుంచి తీసుకు వెళ్లాడని తెలిపారు. మూడున్నర గంటల ప్రాంతంలో దారుసలేంలోని తన గదికి తీసుకు వెళ్లిన నిందితుడు, నిన్ను కిడ్నాప్ చేశామని అభయ్కు చెప్పాడు. దీంతో అతను అరిచాడు. వెంటనే వారు నోటికి, మూతికి ప్లాస్టర్ వేశారు.

దీంతో, అభయ్ మృతి చెందాడని తెలిపారు. అభయ్ చనిపోవడంతో ఏం చేయాలో నిందితులకు పాలుపోలేదన్నారు. దీంతో ఇంటి యజమాని వద్ద ఉన్న ఓ బాక్సులో అభయ్ మృతదేహాన్ని పెట్టారు. అక్కడి నుంటి ఓ ట్రాలీ ఆటోలో ఆబిడ్స్ వచ్చారు.
జగదీశ్ మార్కెట్లో ఓ సెల్ ఫోన్ కొని, దానితో అభయ్ తండ్రిని డబ్బుల కోసం బెదిరించాలని నిందితులు భావించారు. ట్రాలీని ఆబిడ్స్ వద్ద ఆపారు. అక్కడ ట్రాలీ ఆటో డ్రైవర్ ఆగకపోవడంతో మరో ఆటోలో అభయ్ మృతదేహాన్ని సికింద్రాబాద్ వద్దకు తీసుకు వెచ్చి, వదిలి పెట్టి వెళ్లిపోయారు.
రాత్రి గం.7.32 నిమిషాలకు అభయ్ ఉన్న బాక్సును సికింద్రాబాద్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు అభయ్ తండ్రికి ఫోన్ చేసి డబ్బుల కోసం బెదిరించారు. ఆ తర్వాత మీడియాలో కథనాలు చూసి వారు పరారయ్యారని తెలిపారు.
ఈ నెల 16వ తేదీన పదో తరగతి విద్యార్థి అభయ్ని కిడ్నాప్ చేసి హత్య చేశారన్నారు. ఓ అమాయక పిల్లాడిని చంపడం దారుణమైన విషయమన్నారు. అభయ్ కేవలం స్నేహపూర్వకంగా వెళ్లాడని, కానీ హత్యకు గురయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications