వాళ్లు మెచ్చుకున్నారు.. ఏచూరి మాత్రం 'మూసీ'తో పోల్చారు: కేసీఆర్ ఫ్రంటుపై..
హైదరాబాద్: మొన్నీమధ్యే కదా.. సీపీఎం నేతలు తమ్మినేని వీరభద్రం, రాఘవులు సీఎం కేసీఆర్ తో భేటీ అయి.. ఆయన థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదనపై అభినందనలు కురిపించింది. దేశంలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముందని సీఎం అంటే నిజమేనని ఆయనతో ఏకీభవించారు కదా.
వాళ్ల మాట అలా ఉంటే.. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాత్రం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ను మూసీ నదితో పోల్చి తీసికట్టుగా మాట్లాడేశారు. ఏ ఫ్రంట్లలో తాము చేరబోమని, రాజకీయ తీర్మానంపై ఇప్పటికే పార్టీ నేతలందరి అభిప్రాయాలను సేకరించామని చెప్పారు. జాతీయ ప్రత్యామ్యాయ ఫ్రంట్ల గురించి చెబుతూ.. . కేసీఆర్ ఫ్రంట్ను ఏచూరి మూసీ నదితో పోల్చారు.
కాగా, పార్టీ సభ్యుడు ఎవరైనా తమ ప్రతిపాదన ఇవ్వవచ్చునని, ప్రతిపాదనపై కచ్చితంగా చర్చ జరుగుతుందని అన్నారు. పార్టీ లోపాలను సరిదిద్దుకుని ముందుకువెళ్తామని అన్నారు. ఇక జస్టిస్ లోయ మృతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్వతంత్ర దర్యాప్తుకు న్యాయస్థానం అనుమతించకపోవడం దురదృష్టకరం అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో అవగాహన ఒప్పందం ఉండబోదని ఏచూరి స్పష్టం చేశారు. మోడీ సర్కారును గద్దె దించడంపై మహాసభల్లో చర్చించబోతున్నామని చెప్పారు.
ఇదిలా ఉంటే, సీపీఎం 22వ అఖిల భారత మహాసభలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు నగరంలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగే సభలకు 16 మంది పార్టీ పొలిట్బ్యూరో సభ్యులతోపాటు వివిధ వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, పలు రాష్ట్రాలకు చెందిన పార్టీ అగ్ర నాయకులు, కార్యకర్తలు హాజరవనున్నారు.