రేవంత్ రెడ్డికి మహ్మద్ సిరాజ్ గిఫ్ట్
Mohammad Siraj: భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్.. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్స్ విజయాన్ని ఎంజాయ్ చేస్తోన్నాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో ఫైనల్స్ జరిగిన వెస్టిండీస్ బార్బడొస్ నుంచి జట్టుతో కలిసి స్వదేశానికి వచ్చాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ ఎక్స్పీరియన్స్ను ఆయనతో పంచుకున్నాడు.
అదే రోజున సాయంత్రం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ముంబై మెరైన్ డ్రైవ్లో ఏర్పాటు చేసిన బిగ్గెస్ట్ విక్టరీ పరేడ్లో పాల్గొన్నాడు. తనకు బాగా అచ్చొచ్చిన వాంఖెడే స్టేడియంలో నిర్వహించిన సెలబ్రేషన్స్లో అదరగొట్టాడు. పక్కా హైదరాబాదీ స్టైల్ డాన్స్తో విజిల్స్ వేయించాడు. సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా నిలిచాడు.

ముంబై నుంచి హైదరాబాద్కు చేరుకున్నప్పుడూ అదే తరహాలో గ్రాండ్ వెల్కమ్ లభించిందతనికి. వందలాదిమంది అభిమానులు స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇంటివరకు భారీ ర్యాలీ నిర్వహించారు. టీ20 వరల్డ్ కప్ను గెలిచిన జట్టులో భాగస్వామిగా చిరస్థాయిగా అతను నిలిచిపోయాడు.
తాజాగా- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాడు మహ్మద్ సిరాజ్. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీమిండియా మాజీ కేప్టెన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ అజరుద్దీన్తో కలిసి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లాడు. మర్యాదపూరకంగా ఆయనను కలిశాడు. ఈ సందర్భంగా టీమిండియా జెర్సీని రేవంత్కు బహూకరించాడు సిరాజ్.
టీ20 వరల్డ్ కప్లో మహ్మద్ సిరాజ్ పెద్దగా రాణించలేదనే విషయం తెలిసిందే. టోర్నమెంట్ మొత్తం మీద మూడు మ్యాచ్లను ఆడాడు. ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టగలిగాడు. ఫైనల్స్ ఆడిన తుదిజట్టులోనూ అతనికి చోటు దక్కలేదు. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్.. సత్తాచాటారు.












Click it and Unblock the Notifications