దారి మళ్లించేందుకే సెక్షన్ 8: విద్వేషాలు రెచ్చగొట్టొద్దన్న డీఎస్
హైదరాబాద్: హైదరాబాద్లో అల్లర్లు సృష్టించడానికి కుట్రలు జరుగుతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ అన్నారు. ప్రశాంతంగా జరిగిన రాష్ట్ర విభజనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సెక్షన్-8 పేరుతో రాద్ధాంతం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
తాను చేసిన తప్పులను కప్పి పుచ్చుకోవడానికే వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు సెక్షన్-8 ఇంత కాలం గుర్తుకు రాలేదా? అని నిలదీశారు. కేసు విచారణను దారి మళ్లించేందుకే సెక్షన్-8ను భుజానకెత్తుకున్నారని మండిపడ్డారు.
సెక్షన్ 8 ఎందుకు అమలు చేయాలో ఏపి సిఎం, మంత్రులు చెప్పాలని డిఎస్ ప్రశ్నించారు. హైదరాబాద్లో సీమాంధ్రులకు ఎలాంటి అన్యాయం జరిగిందో ఏపి సిఎం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టిడిపి నేతలు యత్నిస్తున్నారని డిఎస్ ఆరోపించారు.
సెక్షన్ 8 అవసరం లేదనడానికి హైదరాబాద్ పరిస్థితులే కారణమని డిఎస్ పేర్కొన్నారు. హైదరాబాద్ అంశాన్ని వివాదాస్పదం చేయాలని చూస్తే ప్రజలు సహించరని అన్నారు. సెక్షన్ 8 అమలు చేస్తే ఆమరణ దీక్ష చేస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ అనడం సరికాదన్నారు.
ఇద్దరు సిఎంలు భావోద్వేగాలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. స్వప్రయోజనాల కోసం చంద్రబాబు సెక్షన్ 8ను ముందుకు తీసుకొచ్చారని ఆరోపించారు. సెక్షన్ 8 అవసరం రాదని తాము కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఆనాడే చెప్పామని డిఎస్ తెలిపారు. తనను కాంగ్రెస్ అధిష్టానం కూకట్పల్లి నుంచి పోటీ చేయాలని కోరిందని..నిజామాబాద్ను వదులుకోలేకే తాను అక్కడ నుంచి పోటీ చేయాలని చెప్పారు.
ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలా వాదిస్తారు: న్యాయవాది
ఓటుకు నోటు కేసులో నిందితుడు మత్తయ్య వెనుక ఏపీ సర్కారు, టీడీపీలు ఉన్నాయని న్యాయవాది మోహన్రావు ఆరోపించారు. బుధవారం ఆయన హైకోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. మత్తయ్య అరెస్టుపై కోర్టు స్టే ఇవ్వడంపై అనేక అనుమానాలకు తావిస్తుందని పేర్కొన్నారు.