సినీ సెలబ్రిటీల పేర్లే ఎందుకు...: కెటిఆర్పై దానం ఫైర్
బంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హైదరాబాదులోని పబ్బులపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేస్తామని మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు దానం నాగేందర్ హెచ్చరించారు.
హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న హైదరాబాదులోని పబ్బులపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెరుపు దాడులు చేస్తామని మాజీ మంత్రి, కాంగ్రెసు నాయకుడు దానం నాగేందర్ హెచ్చరించారు. పబ్బులపై నియంత్రణ విధించకుండా తమను అడ్డుకునే ప్రయత్నంచేస్తే తీవ్రమైన పరిణామాలుంటాయని అన్నారు.
డ్రగ్స్ కేసును విచారణ జరుపుతున్న అధికారులపై ఒత్తిడి తగదని అన్నారు. తమ పార్టీ నాయకుడు దిగ్విజయ్సింగ్ చేసిన ఆరోపణలపై స్పందించడకుండా మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
సోమవారం ఆయన గాంధీభవన్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ రోడ్నెం.36లో ఒక పబ్ని టెర్రస్పై నడుపుతున్నారని, అది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని దానం అన్నారు. డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చాక పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
డ్రగ్స్ కేసులో కేవలం సెలబ్రిటీల పేర్లే ఎందుకు బయటకు వస్తున్నాయని ఆయన అడిగారు. సినిమా వాళ్ల పేరుతో సమస్యను పక్క దోవపట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కేసుని విచారిస్తున్న అధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని డిమాండ్ చేశారు.