కేసీఆర్ కు తలనొప్పిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్..
కేంద్రంలోని బీజేపీపై నిత్యం విరుచుకుపడుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెద్ద తలనొప్పిగా మారింది. ఢిల్లీ మద్యం పాలసీ అవకతవకల వ్యవహారంలో తన కుమార్తె, నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత పేరు తెరమీదకు రావడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రగడ మొదలైంది. మద్యం పాలసీ అవకతవకల వ్యవహారంలో కవిత ప్రమేయం ఉందని, ఆమె ద్వారా డబ్బు లావాదేవీలు జరిగాయి అంటూ వస్తున్న ఆరోపణలతో తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పేరు... కేసీఆర్ ఆగ్రహం
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అనూహ్యంగా కవిత పేరు బయటకు రావడం, ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారడంతో కెసిఆర్ కుమార్తె కవిత పై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కేంద్రంలోని బిజెపి సర్కార్ పై బలంగా పోరాటం చేస్తున్న తరుణంలో ఇటువంటి వ్యవహారం ఆయనకు కొంత చిరాకును, అసహనాన్ని కలిగించిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటువంటి తలపోటు వ్యవహారాలలో తలదూర్చడం మంచిది కాదని ఆయన కవిత పట్ల కాస్త ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం .. ఆరోపించిన బీజేపీ ఎంపీ, బీజేపీ మాజీ ఎమ్మెల్యే
ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. కెసిఆర్ కుటుంబ సభ్యుల సూచనలతోనే ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారని, మద్యం విధానానికి సంబంధించిన చర్చల్లో స్వయంగా కవిత పాల్గొన్నారని, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా, ఎక్సైజ్ అధికారులు, కెసిఆర్ కుటుంబ సభ్యులు సదరు హోటల్లో జరిగిన చర్చల్లో డీల్ కుదుర్చుకున్నారని వారు ఆరోపించారు.

లిక్కర్ మాఫియా డీల్ లో మొదటి విడత మొత్తం కవిత ద్వారానే సిసోడియాకు
తెలంగాణకు చెందిన ఓ మద్యం వ్యాపారి ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్లో ఆరునెలలపాటు కవిత కోసం ఒక గదిని బుక్ చేసి ఉంచారని తెలిపారు. కోకాపేటకు చెందిన రామచంద్రన్ పిళ్ళై అనే మద్యం వ్యాపారిని ఢిల్లీలో వ్యాపారం చేయడానికి కవిత తీసుకువచ్చారని కూడా పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానాన్ని కెసిఆర్ కుటుంబ సభ్యులు పంజాబ్, ఢిల్లీ లలో అమలు చేయించారని కూడా వారు పేర్కొన్నారు. లిక్కర్ మాఫియా కమిషన్ ను పది శాతం పెంచేందుకు చేసుకున్న 150 కోట్ల రూపాయల డీల్ లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా సిసోడియా కు ముట్టిందని వారు పేర్కొన్నారు.

క్లారిటీ ఇచ్చిన కవిత, అసహనంలో కేసీఆర్ .. భవిష్యత్ వ్యూహం ఏంటో ?
అయితే ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపగా, ఎమ్మెల్సీ కవిత తనకు ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని, కేసీఆర్ కుమార్తెను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడతారు అన్న ఉద్దేశంతో ఈ తరహా చర్యకు పాల్పడ్డారంటూ, ఎలాంటి దర్యాప్తు అయినా తాను సహకరిస్తానని తేల్చి చెప్పారు. ఏమి చేసినా కేంద్రంపై పోరాటంలో తాము వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం ఈ వ్యవహారంలో, కవిత పేరు బయటకు రావడం పై తీవ్ర అసహనంతో ఉన్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఈ నేపథ్యంలో కేంద్రంపై దూకుడుగా వెళుతున్న కేసీఆర్ కుమార్తె కవిత వ్యవహారంతో తన దూకుడును తగ్గిస్తారా? లేక మరింత దూకుడుగా కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications