భయం గుప్పిట్లో బీఆర్ఎస్: డిప్యూటీ సీఎం భట్టి వ్యాఖ్యల అర్ధం అదేనా!!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తో పాటు మరో 11 మంది మంత్రులు తమ బాధ్యతలను చేపట్టి పాలన మొదలుపెట్టారు. ఇక నిన్నటి వరకు హైదరాబాదులో ఉన్న మంత్రులు, ఒక్కొక్కరుగా తమ సొంత ప్రాంతాలకు వెళుతున్నారు. ఇక తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాకు వెళ్ళారు. అక్కడ మొదటిసారి ఆయన చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. మధిర నియోజకవర్గ ప్రజల అండతోనే తాను ఈ ఉన్నతమైన పదవిని చేపట్టానని, ఒక చారిత్రక విజయం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని చెప్పిన ఆయన గత బీఆర్ఎస్ పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో ఒక ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిందన్న ఆయన, నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడారని పేర్కొన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పాలనపై శ్వేత పత్రం విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పటంతో బీఆర్ఎస్ నేతలు వణికిపోతున్నారు.
బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ప్రగతి పథంలో నడిచింది అని చెప్పుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పలు శాఖల్లో అక్రమాలు, ఫైళ్ళ మాయం వ్యవహారాలు బయట పడుతున్న క్రమంలో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇక ఈ సమయంలో భట్టి విక్రమార్క శ్వేత పత్రం విడుదల చేస్తామని చెప్పటంతో వారిలో టెన్షన్ పీక్స్ కు చేరుకుంది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీస్తుందని ప్రచారం జరుగుతున్న క్రమంలో భట్టి విక్రమార్క వ్యాఖ్యలు అందుకు బలాన్ని ఇస్తున్నాయి. ఇక ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలు జాగ్రత్త అన్న సంకేతాలను ఇస్తున్నాయి. ఒకవేళ శ్వేతపత్రం విడుదల చేస్తే అందులో ఏం బయటపడతాయో అన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.












Click it and Unblock the Notifications