కొండా సురేఖకు మద్దతు, ఎర్రబెల్లికి సెగ, తెరపైకి కడియం కావ్య: అసంతృప్తులు, రంగంలోకి కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో అసమ్మతి కొనసాగుతోంది. పలు నియోజకవర్గాల్లో టిక్కెట్ల కేటాయింపుపై నేతలు అసంతృప్తితో ఉన్నారు. తాము ఉద్యమంలో పని చేస్తే, ఉద్యమాన్ని నీరుగార్చిన వారికి టిక్కెట్లు ఇస్తున్నారని, తమతో లబ్ధి పొందేందుకు పార్టీలో చేర్చుకొని, ఇప్పుడు చేయి ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
చదవండి: అరెస్ట్ వారెంట్లో ట్విస్ట్, నోటీసులిస్తే స్పందించని బాబు: వీడియో కాన్ఫరెన్స్ ద్వారానా?
స్టేషన్ ఘనపూర్లో మాజీ ఉప ముఖ్యమంత్రి, తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్యకు, సభాపతి మధుసూదనా చారికి, వేములవాడ నుంచి రమేష్ బాబుకు, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర రావు తదితరులకు నిరసన సెగ తాకుతోంది. అసంతృప్తి గళాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అవసరమైతే స్వతంత్రంగానైనా పోటీ చేస్తామని చెబుతున్నారు. అసంతృప్తులను కేటీఆర్ బుజ్జగిస్తున్నారు.

ఎర్రబెల్లికి వ్యతిరేకంగా అసంతృప్తుల సమీకరణ
తనకు అవకాశమిస్తే పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు తక్కెళ్లపల్లి రవీందర రావు అంటున్నారు. రెండ్రోజుల క్రితం దేవరుప్పులలో తెలంగాణ ఉద్యమకారులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలోని ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నారన్నారు. వారిని కాపాడుకునేందుకు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నారు. ఎమ్మెల్యే టికెట్ విషయంలో అధిష్ఠానంతో చర్చించి త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఎమ్మెల్యే టికెట్ రానట్లయితే నియోజకవర్గ కేంద్రంలో ఉద్యమకారులతో సమావేశాన్ని నిర్వహించి, వారి ఆలోచనలతో ముందుకెళ్తామని చెప్పారు. ఎర్రబెల్లి దయాకర రావుకు వ్యతిరేకంగా ఈయన అసంతృప్తులను సమీకరిస్తున్నారు.

కొండా సురేఖకు మద్దతుగా
కొండా సురేఖ తనకు టిక్కెట్ రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారు. తనకు వరంగల్ తూర్పు టిక్కెట్ రాకుంటే అవసరమైతే మూడుచోట్ల ముగ్గురం స్వతంత్ర్య అభ్యర్థులుగా పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. ఆమెకు మద్దతుగా పలువురు మీడియా ముందుకు వస్తున్నారు. కేసీఆర్, హరీశ్ రావు తరువాత సర్వేలో మూడో పేరుగా ఉన్న కొండా సురేఖకు ఫస్ట్ లిస్టులో ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని వారి అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు టిక్కెట్ రాకుండా అడ్డుకుంటున్న ద్రోహులు ఎవరని నిలదీస్తున్నారు. వారు నిజమైన తెలంగాణవాదులని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే ఉమ్మడి జిల్లాలో అమరులైన 100 మంది కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున సాయం అందించారన్నారు. ఉద్యమంలో లేనివారు, ఎన్నికల అనంతరం పార్టీలో చేరినవారు, కొండా దంపతులంటే గిట్టనివారు పనిగట్టుకొని తప్పుడు సమాచారం అందించి టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారంటున్నారు. ఆమెకు కేసీఆర్ టిక్కెట్ ఇవ్వాలని, లేదంటే కొండా దంపతులు ఏ నిర్ణయం తీసకున్నా వారితో కలిసి నడుస్తామంటున్నారు.

కడియం కావ్యకు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్
స్టేషన్ ఘన్పూర్లో తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కడియం శ్రీహరి వర్గీయులు హన్మకొండకు తరలివెళ్లారు.
కడియంను కలిసి స్టేషన్ ఘన్పూర్లో పోటీ చేయాలని నినాదాలు చేశారు. ఆయన సముదాయించే ప్రయత్నాలు చేసినా వినలేదు. కడియం శ్రీహరి పోటీ చేయకుంటే కూతురు కడియం కావ్యను దించాలని కోరారు. అవినీతిపరుడైన రాజయ్యకు టికెట్టు సహించమని, అభ్యర్థిని మార్చి శ్రీహరికి టికెట్ ఇవ్వాలన్నారు. కడియం మాట్లాడుతూ... కేసీఆర్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని, అభ్యర్థి ముఖ్యం కాదని, రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడమే ముఖ్యమని, కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యమన్నారు. ప్రజల ఆవేదనను కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని, కడియం అంటే క్రమశిక్షణ అని, ఎక్కడా తలదించుకునే పరిస్థితి తీసుకురాలేదన్నారు. ఘన్పూర్లో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు.

స్పీకర్ సహా పలువురికి సెగ
మధుసూదనాచారికి టిక్కెట్ నిరసిస్తూ స్థానిక నేత గండ్ర సత్యనారాయణ నియోజకవర్గంలో భారీఎత్తున ర్యాలీ నిర్వహించారు. తానూ పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. వేములవాడలో రమేశ్ బాబును తప్పించాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆలేరులో గొంగడి సునీతను మార్చాలని, లేదంటే ఆమెను ఓడిస్తామని చెబుతున్నారు. భువనగిరిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డిపై అగ్గిమీద గుగ్గలం అవుతున్నారు. సభతో అసమ్మతిని తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. నారాయణఖేడ్లోను భూపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నేతలు సమావేశమయ్యారు. ఖానాపూర్ టిక్కెట్ పైన ఆశలు పెట్టుకున్న రమేష్ రాథోడ్.. రేఖా నాయక్ పైన పోటీకి సిద్ధమవుతున్నారు. పాత మహబూబ్ నగర్ జిల్లా సహా పలు జిల్లాల్లోను ఇదే పరిస్థితి.

కేటీఆర్ బుజ్జగింపులు
పలువురు అసంతృప్తులను బుజ్జగించేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి అభ్యర్థి జైపాల్యాదవ్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, క్రిష్ణారెడ్డి, జనగామ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న మండలి శ్రీరాములు తదితరులతో సమావేశమయ్యారు. పలువురు అభ్యర్థులు, ఇతర నేతల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications