తెలుగు రాష్ట్రాలకు షాక్: వెంకయ్యకు ఫడ్నవీస్ సారీ!, టీఆర్టీసీ అదనపు బాదుడు
ముంబై: గోదావరి పుష్కరాలకు వచ్చే ప్రజలు ఇబ్బంది పడకుండా చూడటం కోసం మహారాష్ట్ర నుంచి నీళ్లు విడిచిపెట్టవలసిందిగా తెలుగు రాష్ట్రాలు చేసిన వినతిని మన్నించలేకపోతున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సోమవారం నాడు విచారం వ్యక్తం చేశారు.
మహారాష్ట్రలోని జలాశయాల్లోనే తగినంత నీరు లేదని ఆయన చెప్పారు. కాబట్టి తాము దిగువకు నీరు విడిచి పెట్టే పరిస్థితి లేదని ఆయన చెప్పారు. నీరు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కోరారు.
అయితే, తమ జలాశయాల్లో తగినంత నీరు లేనందున విడువలేమని ఫడ్నవీస్ కేంద్రమంత్రి వెంకయ్యకు ఫోన్ చేసి తెలిపారు. కొద్దిగా నీటిని తాము విడిచి పెట్టినా అది తెలుగు రాష్ట్రాలకు చేరకపోవచ్చునని చెప్పారు. ఒకవేళ వర్షాలు కురిసి తమ జలాశయాలు నిండిపోతే మాత్రం తెలంగాణ, ఏపీల కోసం నీటిని విడుదల చేస్తామన్నారు.
నీరు వదలాల్సిన చోట తగినంత నిల్వ లేదని, తాము ఏం చేయలేమని ఫడ్నవీస్ నిస్సహాయత వ్యక్తం చేశారు. కాగా, తెలంగాణ పరిధిలోని చిన్న రిజర్వాయర్లలో ఉన్న కొద్దిపాటి నీటినే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పుష్కర ఘాట్లకు మళ్లిస్తోంది.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు నుంచి రోజు 3వేల క్యూసెక్కుల చొప్పున పుష్కరాలు పూర్తయ్యే వరకు 6 టీఎంసీల నీటిని విడుదలచేయనున్నారు. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తి ఐదువేల క్యూసెక్కుల నీటిని వదిలారు.
తద్వారా అదిలాబాద్ జిల్లా నిర్మల్ మండలం సోన్ నుంచి మంచిర్యాల సమీపంలోని గూడెం వరకు గల 32 స్నానఘట్టాల వద్ద, నిజామాబాద్ జిల్లా పోచంపాడులోని నాలుగు ఘాట్లు వద్ద నీరు అందుబాటులో ఉంది. కడెం ప్రాజెక్టు నుంచి 6వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి కూడా నదిలోకి విడుస్తున్నారు.
కాగా, బాసలలోను, గోదావరి, మంజీర, హంద్రీ నదుల త్రివేణీ సంగమం అయిన నిజామాబాద్ జిల్లా కందుకుర్తిలోను గోదావరి నీరు లేక బోసిపోతోంది.
అదనపు ఛార్జీలపై బిజెపి మండిపాటు
తెలంగాణ ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తోందని, పుష్కరాల బస్సుల్లో సర్ ఛార్జీ పేరుతో దోపిడీకి పాల్పడుతోందని బిజెపి మండిపడితోంది.
రంజాన్ పండుగకు కోట్లాది రూపాయలు కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం పుష్కరాలకు ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రం 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయడం ఏమిటన్నారు. ఓ వర్గం వారికి రాయితీ, మరో వర్గం వారిపై భారం ఏమిటన్నారు. కాగా, ఏపీ బస్సుల్లో ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే ఉన్నాయి.