కోదండరాంకు అసమ్మతి సెగ: ఒంటెద్దు పోకడలంటున్న 'జేఏసీ' కన్వీనర్
కోర్టు ఆదేశాల మేరకు నాగోలులో సభ నిర్వహించి ఉంటే నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లేవని, కానీ కోదండరాం వ్యక్తిగత మైలేజీ కోసం ప్రయత్నిస్తూ సభ నిర్వహించడానికి ఒప్పుకోలేదని టీజేఏసీ నేతలు .
హైదరాబాద్: ప్రభుత్వంపై నిరసన గళం వినిపిస్తున్న తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాంకు అప్పుడే సొంతగూటి నుంచి సెగ మొదలైంది. తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కోదండరాం ఒంటెద్దు పోకడలు పోతున్నారని పలువురు టీజేఏసీ నేతలు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
కోర్టు ఆదేశాల మేరకు నాగోలులో సభ నిర్వహించి ఉంటే నిరుద్యోగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లేవని, కానీ కోదండరాం వ్యక్తిగత మైలేజీ కోసం ప్రయత్నిస్తూ సభ నిర్వహించడానికి ఒప్పుకోలేదని టీజేఏసీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో నేటి టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని బహిష్కరించాలని కన్వీనర్ పిట్టల రవీందర్ సహా పలువురు నిర్ణయించుకున్నారు.
నాగోలులో సభ నిర్వహణకు కోర్టుకు అనుమతిచ్చినా.. సభ ఎందుకు నిర్వహించలేదని కొంతమంది టీజేఏసీ నేతలు కోదండరాంను ప్రశ్నిస్తున్నారు. ర్యాలీలో పాల్గొనడానికి రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు తరలి వచ్చేందుకు సిద్దపడ్డారని, కానీ సభ నిర్వహణకు కోదండరాం అయిష్టత వ్యక్తం చేశారని అన్నారు. నగర నడిబొడ్డులోనే సభ నిర్వహించాలని కోదండరాం పట్టుబట్టారని తెలిపారు. కోదండరాం తీరును నిరసిస్తూ తాము నేటి సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.