సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో మగ శిశువు కోసం తల్లుల ఘర్షణ
హైదరాబాద్: మగశిశువు కోసం ఇద్దరు తల్లులు ఘర్షణకు దిగారు. ఈ సంఘటన సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే, సోమవారం ఆసుపత్రిలో ఒకే సమయంలో ఇద్దరు మహిళలు శిశువలకు జన్మనిచ్చారు.
అందులో ఒక మహిళకు ఆడ శిశువుకు, మరో మహిళ మగ శిశువుకు జన్మనిచ్చారు. అయితే మగ శిశువు తమకే పుట్టాడంటే తమకే పుట్టాడంటూ రెండు కుటుంబాల వారు ఘర్షణకు దిగారు. విషయం తెలుసుకున్న వైద్యులు డీఎన్ఏ టెస్టు చేసి ఎవరి బిడ్డను వారికిచ్చేస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
సౌదీలో ఆదిలాబాద్ వాసి మృతి
పొట్ట కూటి కోసం సౌదీకి వెళ్లిన ఆదిలాబాద్ జిల్లా వాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే, కుంటాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన చాక్పల్లి అశోక్(35) ఈ ఏడాది అక్టోబర్ 20న సౌదీ అరేబియాకు వెళ్లాడు.
శనివారం తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన అశోక్ ఆదివారం సముద్ర తీరంలో శవమై కనిపించాడు. మృతదేహాన్ని గుర్తించిన సౌదీలోని కొందరు తెలుగువారు స్థానికి పోలీసులకు, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
దీంతో అశోక్ కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. అశోక్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి ప్రభుత్వం సాయం చేయాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.