రేపు సాయంత్రం వరకూ ఉంటా, చర్చకు రా?: కేసీఆర్కు డీకే అరుణ సవాల్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్కు కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ సవాల్ విసిరారు. గద్వాల్, జనగామను జిల్లాలుగా చేయాలని కోరుతూ శనివారం ఆమెతో పాటు పొన్నాల లక్ష్మయ్య ఇందిరా పార్క్ వద్ద రెండు రోజుల నిరాహార దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని ఆరోపించారు.
అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదని ఆమె విమర్శించారు. అందుకే రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టామని అన్నారు. రాజకీయ లబ్ధి కోసం కొత్త జిల్లాల ఏర్పాటు తగదని ఆమె అభిప్రాయపడ్డారు. ఏయే ప్రాతిపదికన జిల్లాల విభజన చేస్తున్నారో చెప్పాలన్నారు.
తాను ఆదివారం సాయంత్రం వరకు దీక్షలోనే ఉంటానని, జిల్లాల విభజనపై బహిరంగ చర్చకు రావాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. జిల్లాల విభజన అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా సరే చర్చకు రావొచ్చని అన్నారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా జరుగుతుందని నిరూపించుకోవాలని అన్నారు.

గద్వాల్ జిల్లా కోసం రెండు నెలలుగా పోరాడుతున్నామని ఈ సందర్భంగా డీకే అరుణ గుర్తు చేశారు. ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని టీఆర్ఎస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందని అన్నారు. వాస్తవాలు మాట్లాడాలని సీఎం కేసీఆర్కు సూచించారు.
ఈ ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన విమర్శించారు.ప్రజాభీష్టం మేరకు జిల్లాల విభజన చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం దొంగదారిలో నిర్ణయాలు తీసుకుంటోందని, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొడతారని డీకే అరుణ హెచ్చరించారు.
ఎన్నికల హామీ మేరకు జనగామ జిల్లాను ఏర్పాటు చేయాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా జిల్లాల విభజన వల్లే ప్రజల నుంచి నిరసనలు వస్తున్నాయని ఆయన విమర్శించారు. ఈ దీక్షకు కాంగ్రెస్ నేతలు సంఘీభావం తెలిపారు. మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కాంగ్రెస్ దీక్షల వెనుక రాజకీయ కుట్ర: జూపల్లి
గద్వాల్, జనగామ జిల్లాల ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న దీక్షల వెనుక రాజకీయ కుట్ర ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డీకే అరుణ చేపట్టిన దీక్ష ఓ డ్రామాగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ కోసం టీఆర్ఎస్ దీక్షలు చేసినపుడు ఆనాడు కాంగ్రెస్ నేతలు ఎందుకు దీక్షలు, ధర్నాలు చేయలేదని నిలదీశారు.
కాంగ్రెస్ నేతలకు ఎంతసేపు అధికార దర్పం కోసమే పాకులాడారు తప్ప తెలంగాణ కోసం పోరాటం చేయలేదని విమర్శించారు. గద్వాలను జిల్లా చేయాలని ప్రజలు కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన అన్నారు. సీంఎ కేసీఆర్ తెలంగాణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
తెలంగాణ ఇచ్చేపుడు కూడా కాంగ్రెస్ ఎన్నో పేచీలు పెట్టిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్లే మనకీ కష్టాలు వచ్చాయని అన్నారు. రాజకీయాల కోసం ఇప్పుడు జిల్లాల విభజన జరగడం లేదని, కేవలం పరిపాలన పరమైన సౌలభ్యం కోసం మాత్రమే జిల్లాలను విభజిస్తున్నామని ఆయన అన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications