"మోడీకి వ్యతిరేకంగా వెళ్లొద్దు.. : తటస్థంగా ఉండడమే మేలు"
హైదరాబాద్ : కేంద్రం తీసుకున్న పెద్ద నగదు నోట్ల రద్దు నిర్ణయంపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్ని భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. మోడీకి వ్యతిరేకంగా గళం వినిపించే పార్టీలన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలో.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి నోట్ల రద్దుపై వ్యతిరేకతను తెలియజేసేందుకు సిద్దమవుతున్నాయి.
మరోవైపు నోట్ల రద్దు నిర్ణయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదు. నోట్ల రద్దు వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా దెబ్బ పడుతుందని చెప్పారు తప్పితే.. నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు గానీ, సమర్థిస్తున్నట్టు గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఈ విషయంపై పెద్దగా స్పందించడం లేదు. కేసీఆర్ ఆదేశానుసారమే పార్టీ నాయకులెవరు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేయట్లేదని తెలుస్తోంది.

అటు వ్యతిరేకించకుండా.. ఇటు సమర్థించకుండా.. ఈ విషయంలో తటస్థంగా ఉండడమే మేలు అన్న అభిప్రాయలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఇదే విషయం పార్టీ ఎంపీలతోను ఆయన చర్చించినట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీయే అయినప్పటికీ.. ముందునుంచి బీజేపీపై, ప్రత్యేకించి మోడీపై టీఆర్ఎస్ నేతలు ప్రత్యక్ష విమర్శలకు దిగిన సందర్బాలు చాలా తక్కువ.
ఇప్పుడు కూడా అదే వైఖరిని అవలంభిస్తూ.. తటస్థంగా ఉండిపోవడమే మంచిది అన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారన్న వాదన వినిపిస్తోంది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోను టీఆర్ఎస్ ఎంపీలు నోట్ల రద్దుపై తటస్థ వైఖరినే కొనసాగించే అవకాశముంది.












Click it and Unblock the Notifications