తెలంగాణలోనే తొలిసారి: డ్రోన్ నేత్రంతో పోలీసు నిఘా!
అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు పోలీసులు తొలిసారిగా భూపాలపల్లి జిల్లాలో డ్రోన్ కెమెరా ద్వారా నిఘాకు శ్రీకారం చుట్టారు.పొరుగు రాష్ట్రాల్లో నక్సల్స్ కార్యకలాపాలు అధికంగా ఉన్నాయి.
వరంగల్: అసాంఘిక శక్తుల ఆటకట్టించేందుకు పోలీసులు రాష్ట్రంలోనే తొలిసారిగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో డ్రోన్ కెమెరా ద్వారా నిఘాకు శ్రీకారం చుట్టారు.
పొరుగు రాష్ట్రాల్లో నక్సల్స్ కార్యకలాపాలు అధికంగా ఉండటం, దట్టమైన అడవులు ఎక్కువగా ఉన్నందున జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆర్.భాస్కరన్ చొరవతో ప్రయోగాత్మకంగా కొత్తతరహా నిఘా చేపట్టారు.
తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ నెల 23న డీజీపీ అనురాగ్ శర్మ భూపాలపల్లిలో డ్రోన్ నిఘా విభాగంతో పాటు దానికి అనుసంధానంగా డ్రోన్ మొబైల్ నియంత్రణ వాహనాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.

డ్రోన్ కెమెరా నిఘా విభాగంలో ముగ్గురు సిబ్బందిని నియమించి, వారికి ఇటీవల హైదరాబాద్లో సాంకేతిక పరమైన ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. కెమెరాకు సుమారు రూ.2.లక్షలదాకా వ్యయమైంది. ఇప్పటికే డ్రోన్ కెమెరా భూపాలపల్లి పట్టణంలో 500 మీటర్ల ఎత్తు నుంచి తిరుగుతూ నిఘా చేపడుతోంది.
డ్రోన్ల వల్ల ఉపయోగాలు
ధర్నాలు, రాస్తారోకోలు, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీసులను పంపకుండానే డ్రోన్తో అక్కడి సమాచారాన్ని, ఛాయాచిత్రాలను నిక్షిప్తం చేయొచ్చు. న్యాయపరమైన సమస్యల్లో అవి సాక్ష్యాలుగా తోడ్పడతాయి.
ప్రముఖులు అటవీ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు రోడ్డు క్లియరెన్స్ చేసుకోవచ్చు.
డ్రోన్ కెమెరాతో 25 కిలోమీటర్ల దూరం వరకు జరిగే సంఘటనలు తెలుసుకోవచ్చు.












Click it and Unblock the Notifications