రాష్ట్రంలో అప్పుడే భానుడి భగ భగలు ... ఎండలతో జనం విల విల
హైదరాబాద్ : ఎండకాలం సీజన్ ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగ భగలతో జనం విల విలలాడుతున్నారు. ఉదయం 9 అయ్యిందంటే చాలు భానుడి ప్రచండరూపం దాల్చి .. సాయంత్రం వరకు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు.
ఠారెత్తిస్తోన్న ఎండలు
ఎండకాలం ప్రారంభంలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందని జనం ఆందోళన చెందుతున్నారు. ఈ సారి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావారణ విభాగం తెలుపడంతో హైరానా పడుతున్నారు. వచ్చే మూడురోజులు ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. క్రమంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ స్పష్టంచేసింది.

ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలను ఓ సారి పరిశీలిస్తే .. నాగర్ కర్నూలు, నిర్మల్ జిల్లాల్లో 39.3, జగిత్యాల, వనపర్తిలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో సాధారణం కన్నా మూడు డిగ్రీలు అధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. మెదక్, ఖమ్మం జిల్లాల్లో వరుసగా 38, 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని .. ఇది సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికమని అధికారులు తెలిపారు. దీంతోపాటు రాత్రి ఉష్ణోగ్రతలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications