నేడు తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్: నామినేషన్లు షురూ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. కేంద్రఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. నోటిఫికేషన్కు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత 119 నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు నామినేషన్లు స్వీకరిస్తారు.
నవంబర్ 10 వరకు అభ్యర్థులు ప్రతి రోజూ ఉదయం 11 నుంచి.. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నవంబర్ 13న నామినేషన్ పత్రాల పరిశీలన చేపట్టనండగా.. ఈనెల 15 వరకు ఉపసంహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. నవంబర్ 30న పొలింగ్ నిర్వహించి వచ్చేనెల అంటే డిసెంబర్ 3న ఓట్లలెక్కింపు చేపడతారు. డిసెంబర్ 5లోపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది.

నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్ఠంగా నాలుగుసెట్ల నామినేషన్లు వేయవచ్చు. ఒక అభ్యర్థి రెండుకు మించి నియోజకవర్గాల్లో పోటీ చేయరాదు. నామినేషన్ల దాఖలులో.. ఆర్వో, ఏఆర్వో కార్యాలయం సమీపంలోని వంద మీటర్ల పరిధిలోకి గరిష్ఠంగా మూడు వాహనాలనే అనుమతిస్తారు. నామినేషన్ ప్రక్రియ, కార్యాలయం వెలుపల వీడియో, సీసీటీవీ ద్వారా రికార్డు చేస్తారు.
కాగా, అభ్యర్థులు నామినేషన్లను ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. ఈసీ అందుబాటులోకి తీసుకొచ్చిన సువిధ పోర్టల్ ద్వారా ఆ సదుపాయం ఉందని చెప్పారు. ఆన్లైన్లో నామినేషన్ సమర్పించినా అభ్యర్థి ఆ ప్రతిపై సంతకంచేసి నిర్ధిష్ట గడువులోగా రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంటుంది. విదేశీ ఓటర్లు అక్కడి నుంచే నామినేషన్ దాఖలు చేస్తే అక్కడి రాయబార కార్యాలయాలు, కాన్సుల్ కార్యాలయాల్లో ప్రమాణం చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
మరోవైపు, శుక్రవారం నుంచి ఎన్నికల వ్యయ పరిశీలకులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు గాను 60 మంది ఇతర రాష్ట్రాల్లో పని చేస్తున్న ఐఆర్ఎస్, ఐఆర్ఎస్ఎలను పరిశీలకులుగా నియమించగా శుక్రవారం నుంచి వారు విధుల్లో ఉంటారు. వారికి సహాయకంగా ఇతర అధికారులు, సిబ్బంది ఉంటారు. అభ్యర్థులు చేసే ఖర్చుపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టడంతో పాటు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారు. 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమించారు. కేటాయించిన నియోజకవర్గాల్లో శాంతిభద్రతల నిర్వహణ, సంబంధిత అంశాలను వారు పర్యవేక్షిస్తారు. ఇప్పటికే ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేస్తున్నామని ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. తనిఖీలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications