ఇప్పటికైనా కళ్లు తెరవండి: కెసిఆర్పై ఎర్రబెల్లి, క్షమాపణ చెప్పాలన్న డికె అరుణ
హైదరాబాద్: తెలంగాణలోని అన్ని జిల్లాలు, మండలాల్లో కరవు తీవ్రంగా ఉందని తెదేపా శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్భవన్లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా కరవు విలయతాండవం చేస్తోందన్నారు.
రైతుల బతుకులతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు. రైతులంటే ఎందుకు చిన్నచూపు... అని ప్రశ్నించారు. సీఎం సొంత జిల్లా మొదక్లోనే ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు ఇప్పటికైనా కళ్లు తెరవాలని అన్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 1.50లక్షలు కాదు 6లక్షలు పరిహారం ఇవ్వాలని అన్నారు. పక్క రాష్ట్రంలో సిఎం చంద్రబాబు రైతులకు రూ. 5లక్షల పరిహారం ఇచ్చారని తెలిపారు. రైతులపై చిన్న చూపు తగదని అన్నారు.
సంక్షోభంలో వ్యవసాయం: కిషన్
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదని విమర్శించారు.
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కరవు అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీని వేయాలని, కరవు ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించాలని కిషన్రెడ్డి సూచించారు.
కెసిఆర్ క్షమాపణ చెప్పాలి: డికె అరుణ
మహబూబ్నగర్: తన సోదరుడు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డిపై దాడి చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే జి బాలరాజుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ ప్రభుత్వానికి సూచించారు.
శనివారం మహబూబ్నగర్లో డికె అరుణ మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కులం పేరుతో దాడికి దిగడం తగదని డికె అరుణ అన్నారు. ఇలాంటి వ్యక్తులతో బంగారు తెలంగాణ ఎలా సాధిస్తారో ఆలోచించాలని కెసిఆర్కు డికె అరుణ హితవు పలికారు.